లగ్గానికి సిద్ధమంటున్న చంద్రబాబు

పెళ్లికే కాదు… పోరుకు కూడా లగ్గం పెట్టాల్సిందేనా.. అప్పుడే పోటీ రసవత్తరంగా ఉంటుందా. కొన్ని గంటలుగా ఈ చర్చ ఏపీ రాజకీయాల్లో ఊపందుకుంది. నేరుగా కొట్టుకుందాం రా… అని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు సవాలు విసిరారు. వైసీపీ అరాచకాలకు చరమగితం పాడే సమయం వచ్చిందని తేల్చిన చంద్రబాబు.. ఇక వన్ టు వన్ ఫైట్‌కు రెడీ అవుతున్నట్లు నేరుగానే ప్రకటించారు…

ఈ నెల 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ దాడి చేసి విధ్వంసం సృష్టించడంతో పాటు, స్థానిక టీడీపీ నేత దొంతు చిన్నా పై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి చంద్రబాబు మనోధైర్యం కల్పించారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అనంతరం వైసీపీ నాయకుల దాడిలో విధ్వంసానికి గురైన గన్నవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంతో పాటు, దగ్దం చేసిన టీడీపీ నేతల వాహనాలను ఆయన పరిశీలించారు.

గన్నవరం కార్యాలయం పై దాడి జరిగి ఐదు రోజులు గడిచినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, టీడీపీ నాయకుల పైనే కేసులు పెట్టి వేదించడం సరైన పద్దతి కాదని చంద్రబాబు మీడియాతో అన్నారు. తనను గన్నవరంలో పర్యటించొద్దని చెప్పడానికి పోలీసులెవరని, గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా అని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు సిగ్గు మాలిన పనులు చేస్తున్నారని, వారి కుటుంబ సభ్యుల వద్ద అయినా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఉద్యమంలో అంతా ఐక్యం కావాలని, ఇందుకు ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలన్నారు.

ఒక సందర్భంలో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. దొంగ దెబ్బలు, దొంగ ఆటలు వద్దని హెచ్చరించారు. లగ్గం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామని సవాలు చేశారు. పోలీసులు లేకుండా రావాలని, ధైర్యం ఉంటే సైకోని కూడా రమ్మనాలని చంద్రబాబు అన్నారు. ఇక తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చిందని చంద్రబాబు డిసైడయ్యారు. నిజానికి ఇదీ వైసీపీలోని చిన్నా చితకా నేతలకు చంద్రబాబు చేసిన సవాలు కాదు. నేరుగా సీఎం జగన్‌కు చేసిన సవాలు. మరి ముఖ్యమంత్రి స్పందిస్తారో లేదో చూడాలి…