కొట్టి..కొట్టి..కొట్టి…కొట్టి…

గన్నవరం ఘటనల్లో భాదితులపైనే కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం పదకొండు మందిని అరెస్టు చేసింది. అందులో టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను ఏ-1 నిందితుడిగా చేర్చారు. వారందరినీ కోర్టులో హాజరు పరచారు. పోలీసు స్టేషన్లో తనను కొట్టారని న్యాయమూర్తి ముందు పట్టాభి గోడు వినిపించారు. వైద్య పరీక్ష తర్వాత 14 రోజుల రిమాండ్ కొనసాగించడంతో తొలుత సబ్ జైలుకు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రెండు రోజుల పాటు జరిగిన పరిణామాల్లో కొన్ని ఆందోళనకర అంశాలు కూడా వెలుగు చూశాయి.

థర్డ్ డిగ్రీ

అరికాళ్ల పై కొట్టడం… ఆ తరువాత పది నిమిషాలు నడిపించడం …. అనంతరం మరోసారి అరిచేతులను ఒకరు పట్టుకొని లాఠీలతో కొట్టడం… రెండు చేతుల పై కొట్టిన తరువాత గోడకి అరచేతులను రుద్దించడం లాంటి థర్డ్ డిగ్రీ టార్చర్ పద్ధతులను పట్టాభిపై ప్రయోగించారు. ఆపకుండా నలభై నిమిషాల పాటు కొట్టారని పట్టాభి వెల్లడించారు. రెండు కాళ్ల మధ్య తలపెట్టి ఒత్తేశారు.దానితో ప్రాణం పోతుందని భయపడినట్లు పట్టాభి చెప్పుకున్నారు.

రోడ్లన్నీ తిప్పి

కృష్ణాజిల్లా గన్నవరంలో పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న పట్టాభిని అర్ధరాత్రి 2 గంటల వరకూ వివిధ ప్రాంతాల్లో సుమారు 200 కిలో మీటర్లు తిప్పారు. పట్టాభి కనిపించడం లేదని పార్టీ వారు, కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వమూ, పోలీసు శాఖ పట్టించుకోలేదు. తిప్పి తిప్పి చివరకు పమిడిముక్కల ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని పట్టాభి పార్టీ నేతలకు వివరించినట్టు తెలిసింది.

ఆయన వెళ్లే సరికి పోలీస్ స్టేషన్ లో లైట్లు కూడా లేవు. తీసుకెళ్లిన పోలీసులు బయటకు వెళ్లిపోగా… ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వచ్చి పట్టాభి తలకు టవల్ చుట్టి పక్క రూములోకీ తీసుకెళ్లారు. ఒకరు పట్టాభిని గట్టిగా పట్టుకుంటే మిగతా వాళ్లు కాళ్లపై కొడుతూ ఉన్నారు. దెబ్బలు కనిపించకుండా, రక్తం గడ్డ కట్టకుండా ఉండే విధంగా కొట్టారని పట్టాభి, టీడీపీ పార్టీ వారికి వివరించారు.

పట్టాభిని అరికాళ్లు , అరిచేతుల పై కొట్టిన తరువాత, తలను రెండు కాళ్ల మధ్యకు తీసుకొచ్చి ఒత్తారని , దీనివల్ల తాను నరకం అనుభవించానని కూడా పట్టాభి నేతలకు వివరించినట్టు తెలిసింది. నేతలు ఈ విషయాలన్నీ న్యాయమూర్తికి పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పడంతో ఆయన న్యాయమూర్తికి చెప్పారు. అయితే చేతి మీద వాపు మినహా ఎక్కడా గాయాలు లేవని వైద్యులు నివేదిక ఇచ్చారు. దానితో న్యాయమూర్తి ఆయన్ను రిమాండుకు పంపారు.