కాపుల కోటలో వెలమదొర.. సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారా?

ఏలూరు ఎంపీ, వైసీపీ నేత కోటగిరి శ్రీధర్ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మార్పులు ఆళ్ల నానికి అనుకూలం కావొచ్చేమో కానీ కోటగిరి శ్రీధర్‌కు ఏమాత్రం అనుకూలం కాదని.. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ దాదాపు కాపులు బలంగా ఉన్నవేనని.. అక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తే కోటగిరికి కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ వెలమ కులానికి చెందినవారు. ఏలూరు ఎంపీ సీటు పరిధిలో కాపు ఓటర్లే అధికంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో వైసీసీ గాలి వీయడం.. క్రాస్ ఓటింగ్ జరగకపోవడంతో ఆయన సునాయాసంగా గెలిచారు. కానీ రానున్న ఎన్నికల్లో పరిస్థితి అలా ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఏలూరు పార్లమెంటు స్థానానికి కాకుండా నూజివీడు అసెంబ్లీకి పోటీచేయాలనుకుంటున్నారట.

ఏలూరు పార్లమెంటు సీటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఉంగటూరు, దెందులూరు, ఏలూరు, కైకలూరులలో కాపు జనాభా అధికం. పోలవరం, చింతలపూడిలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఇక మిగిలిని నూజివీడు నియోజకవర్గంలో మాత్రం వెలమల సంఖ్య ఎక్కువ. దీంతో నూజివీడు అసెంబ్లీ నియోజవకర్గంలో పోటీ చేయడానికి శ్రీధర్ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఎంపీగా నియోజకవర్గంలో పాల్గొంటున్న కార్యక్రమాలు కూడా ఎక్కువగా నూజివీడులోనే ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

పార్టీ అధిష్టానం దగ్గర కూడా శ్రీధర్ ఇప్పటికే తన ఆలోచన చెప్పారని, కానీ, ఇంకా ఆమోద ముద్ర రాలేదని తెలుస్తోంది. అయితే… వచ్చే ఎన్నికల్లో కుల సమీకరణలు కీలకం కావడంతో కోటగిరి ప్లానుకు అధిష్ఠానం ఓకే చెప్పొచ్చని భావిస్తున్నారు. అయితే… నూజివీడు నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావును కాదని కోటగిరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.