టీడీపీలో మ‌న‌సు.. వైసీపీలో మ‌నుషులు.. జంపింగ్ ఖాయం!

కొంద‌రు నేత‌లు.. గ‌త 2019 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వివిధ కార‌ణాల‌తో టీడీపీని విడిచి పెట్టి వైసీపీ లోకి చేరిపోయారు. గ‌తంలో వీరిపై ఉన్న కేసులు కావొచ్చు.. ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలు కావొచ్చు. ఏవైనా కూడా అప్ప‌ట్లో బ‌లంగా ప్ర‌భావం చూపించాయి. దీంతో వారంతా కూడా పార్టీ మారిపోయి.. వైసీపీకి జై కొట్టారు. ఇలాంటివారిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే క‌మ్ మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ రావు వంటివారు ఉన్నారు.

అయితే.. ఇప్పుడు వీరిలో శిద్దారాఘ‌వ‌రావు మాత్రం ఇప్పుడు మ‌రోసారి టీడీపీ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి టీడీపీ త‌ర‌ఫున ఎంపీగా పోటీ చేసేందుకు త‌న‌కు ఇష్టం లేద‌ని.. ఎమ్మెల్యేగానే బ‌రిలో నిలుస్తాన‌ని చంద్ర‌బాబుకు చెప్పారు. అయితే.. అప్ప‌టి స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బ‌లవంతంగానే శిద్దాను.. చంద్ర‌బాబు ఒంగోలుకు పంపారు.

అయితే, శిద్దా మ‌న‌సు మాత్రం ద‌ర్శిపైనే ఉంది. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దా.. ద‌ర్శిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఆయ‌న ద‌ర్శి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక‌, వైసీపీ ఈ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ను సైతం కాద‌ని.. బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌కు ఇచ్చేందుకు జ‌గ‌న్ మొగ్గు చూపుతున్నార‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో తాను వైసీపీలో ఉండి కూడా ఉప‌యోగం లేద‌ని భావిస్తున్న శిద్దా.. టీడీపీలోకి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించేసుకున్న‌ట్టుగా ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. దీనిపై ఇప్ప‌టికే మంత‌నాలు జ‌రుగుతున్నాయ‌ని.. అందుకే చంద్ర‌బాబు కూడా ఇక్క‌డ ఎవ‌రికీ బాధ్య‌త‌లు ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. అంటే.. శిద్దా రాఘ‌వ‌రావు.. త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌చ్చేశాయ‌న్న‌మాట‌.!!