లక్ష్మీపార్వతిది నోరేనా?

ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తారకరత్న మృతి పట్ల బాధపడుతున్న సమయంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆమె పట్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. నందమూరి కుటుంబానికి చెందినవాడు కావడం.. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అల్లుడు వరుస కావడంతో టీడీపీ, వైసీపీ నేతలు చాలామంది పార్టీలకు అతీతంగా తారకరత్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు.

తారకరత్న మంచితనం వల్ల కావొచ్చు.. విజయసాయిరెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉండవల్ల కావొచ్చు ఆయన మృతిపై వైసీపీ నేతలెవరూ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. లోకేశ్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడంతో వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా … విజయసాయిరెడ్డి అల్లుడన్న విషయం తెలియడంతో వైసీపీ సోషల్ సైన్యం దాడి కూడా ఆగిపోయింది. కానీ, తాజాగా లక్ష్మీపార్వతి మాత్రం విషాద సందర్భం అని కూడా చూడకుండా రాజకీయాలతో ముడిపెట్టడంతో విమర్శల పాలవుతున్నారు.

తారకరత్న చనిపోయి చాలా రోజులైందని.. లోకేశ్ పాదయాత్రకు చెడ్డ పేరు వస్తుందని ఈ విషయం దాచి పెట్టారని ఆమె ఆరోపించారు. తారకరత్న మరణాన్ని కూడా చంద్రబాబు, లోకేశ్‌లు స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ కూడా చంద్రబాబు వల్లే కుమిలికుమిలి చనిపోయారని ఆమె అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఈ రాష్ట్రానికి అపశకునమని ఆమె అన్నారు.

అయితే, లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై నిత్యం విమర్శలు చేసే విజయసాయిరెడ్డి కూడా తారకరత్న ఇంట్లోనే ఉండి బాలకృష్ణతో కలిసి మొత్తం ఏర్పాట్లు చూసుకుంటున్నారు. చంద్రబాబుతో కలిసి ఆయన ఏర్పాట్లపై చర్చించారు. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనూ విజయసాయిరెడ్డి మాట్లాడారు.

మరోవైపు తారకరత్న బతికుంటే గుడివాడలో తనపై పోటీచేసేవారన్న సంగతి తెలిసినా కూడా కొడాలి నాని వచ్చి తారకరత్న కుటుంబాన్ని పరామర్శించారు. దురుసుగా మాట్లాడుతారని పేరున్న కొడాలి నాని కూడా చావు ఇంటికి వచ్చి కుటుంబీకులను ఓదార్చి మంచిమాటలు చెప్పి వెళ్లారు.

తనకు ప్రత్యక్షంగా పరిచయం లేనప్పటికీ… తన పాదయాత్ర ఆగిపోయిన గొడవల్లో ఉన్నప్పటికీ .. విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు కావడం వల్ల వైఎస్ షర్మిల కూడా పరామర్శకు వచ్చారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా దీనిపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తారకరత్న మృతికి సంతాపం తెలిపారు.

ఇలాంటి గంభీరమైన వాతావరణంలో లక్ష్మీపార్వతి ఇలా మాట్లాడడంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఒక్కటిగా కనిపించిన బాలకృష్ణ, విజయసాయిరెడ్డి, చంద్రబాబు వంటివారిని చూసి నేర్చుకోవాలని లక్ష్మీపార్వతికి హితబోధ చేస్తున్నారు. ఆమె మాటలు కడివెడు పాలలో విషం చుక్కలాంటివని విమర్శిస్తున్నారు నెటిజన్లు.