జంపింగులు పెరిగితే న‌ష్టం వైసీపీకా… టీడీపీకా…!


ఏపీలో జంప్ జిలానీలు ఇంకా పెరుగుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ జంప్ చేసే నేత‌ల సంఖ్య పెరుగుతోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కంటే కూడా.. వైసీపీలో ఎక్కువ‌గా జంప్ చేసే నేత‌లు పెరుగుతున్నార‌ని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. సీఎం జ‌గ‌న్‌పై మునుపు ఉన్న విశ్వాసం .. ఇప్పుడు నేత‌ల‌కు లేకుండా పోయింద‌ని కూడా అంటున్నారు.

అయితే.. ఎవ‌రూ కూడా ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు మూడు లేదా.. ఆరు మాసాల ముందు.. వైసీపీలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఎందు కంటే.. త‌మ‌కు టికెట్ రాక‌పోతే.. అల‌క‌లు.. బుజ్జ‌గింపుల‌కు ఎవ‌రూ ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన రీతిలో పోటీకి రెడీ అవుతున్నారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు ఇండిపెండెం ట్‌గా అయినా.. పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక‌, పొరుగు పార్టీ త‌ర‌ఫున పోటీకి రెడీ అవుతున్న వారు కూడా క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయం గా వ‌చ్చే ఏడాది లేదా.. ఈ ఏడాది చివ‌రి నాటికి జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. వైసీపీకి న‌ష్టం క‌ల‌గ‌డం ఖాయ‌మ‌నే లెక్క‌లు వ‌స్తున్నాయి. ఇక‌, టీడీపీని చూసుకున్నా.. పార్టీపై న‌మ్మ‌కం ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే స‌మ‌స్య‌వారిని వెంటాడుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటే..త‌మ‌కు ఎస‌రు ఖాయ‌మ‌ని 40 నుంచి 50 మంది నాయ‌కులు అనుకుంటు న్నారు. దీంతో వీరు కూడా ప‌క్క చూపులు చూస్తున్నారు. అయితే.. ఒంట‌రిగా పోటీ చేసే సాహ‌సం వీరికి లేదు. అందుకే వైసీపీ వైపు చూస్తున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. వైసీపీలోనూ టికెట్ వ‌చ్చే ప‌రిస్థితి లేని వారు.. మాత్రం ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అడుగులు వేసే అవ‌కాశం ఉంది. అయితే.. ఎవ‌రు ఎటు వెళ్లినా.. ఆయా పార్టీల‌కు న‌ష్టం మాత్రం ఖాయ‌మ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.