కేసీఆర్‌కు నిర్మ‌ల‌.. ఘాటు వార్నింగ్ !

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అసెంబ్లీ సాక్షిగా.. కేంద్రంపై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. దేశాన్ని అప్పుల కుప్ప‌గా మారుస్తున్నార‌ని.. మోడీ విదానాలు దేశాన్ని నాశ‌నం చేస్తున్నాయ‌ని.. విరుచుకుప‌డ్డారు. ఇది జ‌రిగిన మ‌రునాడే.. పార్ల‌మెంటు వేదిక‌గా.. తెలంగాణ అప్పుల కుప్ప‌గా మారిపోయింద‌ని.. దీనికి ఎవ‌రు బాధ్యులు అంటూ .. కేంద్రం ఎదురు దాడి చేసింది. అంతేకాదు..తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతెంత అప్పులు చేశారో.. కూడా వివ‌రించింది. అయితే.. ఇది చాల‌ద‌నుకున్నారో, ఏమో.. వెంట‌నే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.

త‌న‌పైనా త‌న విధానాల‌పైనా జోకులు వేయొద్ద‌ని.. తేడా వ‌స్తే.. తేడా ఏంటో రుచి చూపిస్తామ‌ని.. తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం టార్గెట్ పెట్టుకున్న‌ 5 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై జోకులు వేయవద్దని హెచ్చ‌రించారు. తెలంగాణకు 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు పెరిగిందని, తమపై విమర్శలు చేస్తున్నారని, మరి మీ సంగతేంటి? అని ఆమె నిల‌దీశారు. మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదని ఆమె ఎద్దేవా చేశారు.

కరీంనగర్‌, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్‌ కాలేజీలున్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లో కాలేజీలకే ప్రతిపాదనలు పెట్టారని నిర్మల ఎద్దేవా చేశారు. నెంబర్స్‌ చూసి విమర్శలు చేస్తే మంచిదని సూచించారు. నో డేటా గవర్నమెంట్ ఎవరిదో ఇప్పుడు అర్థమవుతుందని నిర్మల వ్యాఖ్యానించారు. 2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్‌కు చేరుతుందనడం పెద్దజోక్‌గా శాసనసభలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్‌ అని, మోడీ బడాయిలు పోతున్నారని, వైఫల్యాలను హుందాగా ఒప్పుకోవాలని సీఎం అన్నారు.

ఎకనామీగా ఉండటం వేరని, అసలు సంగతి తలసరి ఆదాయం దగ్గర దొరుకుతుందని కేసీఆర్‌ చెప్పారు. ప్రపంచంలో 192 దేశాలుంటే అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్‌లో ఇండియాది 139వ స్థానమని, మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌ ముందున్నాయని విమర్శించారు. దీనిపై చర్చ జరగాలన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేస్తే దాన్ని ఇండియాలో బ్యాన్‌ చేయాలనడం, సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా ప్రపంచమంతా మనగురించి ఏమనుకుంటుందో కొంచెం ఆలోచించాలన్నారు. వ్యతిరేకిస్తే జైలులో పెడతాం, బ్యాన్‌ చేస్తామంటారా? ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ విమ‌ర్శ‌ల ప‌రంప‌ర‌లోనే కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా హెచ్చ‌రించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.