పవన్ ఫ్యాన్స్ మళ్లీ బుట్టలో పడ్డారు

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సినీ అభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ ముందుంటారు. జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో కంటే కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా ఉండడానికి పవన్ అభిమానులు ఒక కారణం. మిగతా పార్టీల మద్దతుదారుల మాదిరి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా, డబ్బుల కోసం పని చేయకుండా.. నిస్వార్థంగా పవన్ కోసం, జనసేన కోసం పని చేస్తుంటారు ఈ ఫ్యాన్స్. పార్టీ సిద్దాంతాలను సోషల్ మీడియాలోకి బలంగా తీసుకెళ్లడంలో.. పవన్ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో వీరు కీలక పాత్ర పోషిస్తుంటారు.

అదే సమయంలో జనసేన కోసం.. అలాగే కష్టాల్లో ఉన్న జనసైనికులు లేదా పవన్ అభిమానుల కోసం ఉదారంగా స్పందిస్తుంటారు ఫ్యాన్స్. ప్రతి నెలా తమ వంతుగా పార్టీకి కంట్రిబ్యూట్ చేసే వాళ్లు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తారు ట్విట్టర్లో. అలాగే సాటి పవన్ అభిమానులు, జనసైనికులు కష్టాల్లో ఉంటే వెంటనే ఫండ్ రైజింగ్ ఏర్పాటు చేసి తలో చేయి వేస్తుంటారు.

ఇంత ఉదారంగా మరే సినిమా హీరో ఫ్యాన్స్ స్పందించరు అంటే అతిశయోక్తి కాదు. ఐతే పవన్ అభిమానుల్లోని ఈ దయా గుణాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ వాళ్లను బోల్తా కొట్టించే మోసగాళ్లకూ సోషల్ మీడియాలో కొదవలేదు. ప్రధానంగా అనారోగ్య కారణాలు చూపించి, అభిమానుల గుండెలు పిండేసేలా పోస్టులు పెట్టి సాయాలు పొందే కేటుగాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా పలు అనుభవాలు ఎదురైనప్పటికీ ఫ్యాన్స్ వెనుకంజ వేయకుండా సాయాలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా అజయ్ కాంత్ అనే వ్యక్తి తన తల్లికి అనారోగ్యం అని.. ఆమె చనిపోయిందని.. రకరకాల సందర్భాల్లో అభిమానులను బురిడీ కొట్టించి కోటి రూపాయల దాకా కొట్టేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక వ్యక్తే 30 లక్షల దాకా ఆ వ్యక్తికి ఇచ్చినట్లు చెబుతు్నారు. దీని గురించి పవన్ ఫ్యాన్స్, జనసైనికులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఆ వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. ఇదే సందర్భంలో గతంలో జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు ట్విట్టర్లో నిన్నట్నుంచి ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ఇలాంటి వాళ్ల వల్ల నిజంగా కష్టాల్లో ఉన్న వారిని కూడా నమ్మకుండా పోయే పరిస్థితి తలెత్తుతోందని.. కాబట్టి ఇకపై సరిగ్గా వెరిఫై చేసుకున్న తర్వాతే సాయం అందించాలని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.