అష్ట దిగ్బంధనంలో కవిత.. అరెస్ట్ తప్పదా

దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌కు తలనొప్పి మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ పలుమార్లు విచారించగా ఇప్పుడు అల్లుడు అనిల్‌ను కూడా ఈడీ విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఈ గ్రూపును నడిపించారని ఈడీ తన చార్జ్ షీట్లో ఆరోపించింది.

వీరిలో మాగుంట కుమారుడు రాఘవరెడ్డిని, అరబిందో డైరెక్టరు శరత్ చంద్రారెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురిలో ఇక మిగిలింది కేసీఆర్ కూతురు కవితే. అయితే, ఆమె విషయంలో మరింత ముందుకు వెళ్లేముందు కుంభకోణానికి ముందు జరిగిన సమావేశాలు, చర్చల్లో ఉన్న కవిత భర్త అనిల్‌ను కూడా ప్రశ్నించడానికి ఈడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండో స్పిరిట్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు 2021లో సమీర్ మహేంద్ర అనే వ్యక్తి కవితను అప్రోచ్ అయ్యారు. ఆ తరువాత దిల్లీ లిక్కర్ రూపొందడానికి ముందు 2022 మే నెలలో హైదరాబాద్‌లో కవితతో సమీర్ , మరికొందరు సమావేశమైనట్లు ఈడీ చెప్తోంది.

ఈ సమావేశంలో కవిత భర్త అనిల్, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశాలన్నిటిలో ఉన్నందున ఆయనకు కూడా కుంభకోణం గురించి తెలిసే ఉంటుంది కాబట్టి ప్రశ్నించి మరన్ని వివరాలను తెలుసుకోవాలని ఈడీ భావిస్తోంది. త్వరలో ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

ఈ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డి కస్టడీ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆయన్ను విచారించిన తరువాత కవిత భర్త అనిల్‌ విచారణకు ఈడీ సిద్ధం కావొచ్చు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసీఆర్‌కు ఊహించని తలనొప్పులే తేవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.