సీబీఐ అధికారుల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారా?

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా!! అన్న‌ట్టుగా ఉంది టీడీపీ.. వైసీపీల ప‌రిస్థితి. టీడీపీ శుక్ర‌వారం.. మాజీమంత్రి, సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి జ‌గ‌నాసుర ర‌క్త‌చ‌రిత్ర‌ పేరుతో ఒక పుస్త‌కాన్ని విడుద‌ల చేసింది. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే పేర్ని నాని తాజాగా కౌంట‌ర్ ఇచ్చారు. టీడీపీ వివేకాను కెలికితే.. పేర్ని.. ఎన్టీఆర్ విష‌యాన్ని కెలికి.. చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. మొత్తానికి ఈ రెండు పార్టీల ర‌గ‌డ.. ఆస‌క్తిగా మారింది.

విషపు రాతలతో చంద్రబాబు ఒక పుస్తకం అచ్చు వేయించాడని, దానిపై తన పేరు కూడా వేసుకోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు ‘‘పుస్తకంపై ఎక్కడా టీడీపీ పేరు లేదు. ఇవన్నీ అసత్యపు రాతలు కాబట్టే పేరు వేసుకునే ధైర్యం లేదు. అచ్చెన్నాయుడికి బాడీ తప్ప బుర్ర ఉండదు’’ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. వివేకా హత్య జ‌రిగిన‌ప్పుడు రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే ఉంద‌న్నారు. అయితే.. అప్పుడు అధికారంలో ఉండి ఏం చేశార‌ని.. పేర్ని ప్ర‌శ్నించారు.

వివేకానంద‌రెడ్డి భార్య, కుమార్తె సునీత‌, అల్లుడిని ఎందుకు విచారించలేదని పేర్ని ప్ర‌శ్నించారు. డాక్ట‌ర్ సునీత‌ చెప్పిన అంశాలపై ఎందుకు విచారణ జరపలేదని ప్ర‌శ్నించారు.(కానీ, అప్ప‌ట్లో ఆమె బ‌య‌ట‌కు రాలేదు. ఈ విష‌యాన్నిపేర్ని మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నారు) ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబు కదా అని గ‌త విష‌యాన్ని త‌వ్వి తీశారు. ఎన్టీఆర్‌ మరణంపై కూడా ఒక పుస్తకం వేయించాలన్నారు. అంతేకాదు.. మాజీ స్పీక‌ర్‌, దివంగ‌త కోడెల శివప్రసాద్‌ మరణంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు అడగలేదని పేర్ని ప్ర‌శ్నించారు.

‘‘అవినాష్‌రెడ్డి సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడంటూ చంద్రబాబు ఎలా చెబుతాడు?. సీబీఐ దగ్గర అవినాష్‌ చెప్పిన విషయాలు మీకు ఎలా తెలుసు?. సీబీఐ అధికారుల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారా?. చంద్రబాబు డైరెక్షన్‌లో సీబీఐ నడుస్తుందా?. వివేకా హత్యపై టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు ఛార్జ్‌షీట్‌ వేయలేదు?’’ అంటూ పేర్ని నాని నిల‌దీశారు. చంద్రబాబు.. ఆయ‌న ద‌త్త‌పుత్రుడు(ప‌వ‌న్‌) ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను దెబ్బతీయలేరని పేర్ని చెప్పుకొచ్చారు.

రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్లను బజారున ప‌డేస్తావ‌ని చంద్ర‌బాబుపై పేర్ని విరుచుకుప‌డ్డారు.(వాస్త‌వానికి ఈవిష‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలే క‌దా ముందు వ్యాఖ్య‌లు చేసింది) సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేసింది ఎవరని ప్ర‌శ్నించారు. ఇళ్లలో ఉన్న మహిళల ఫొటోలను పుస్తకంలో వేస్తారా?. మీ ఇంట్లో వారే మహిళలా? వేరే ఇళ్లలో ఉన్నవారు మహిళలు కాదా? అని నిల‌దీశారు. మొత్తానికి దీనిపై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.