కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కుంటావా.. జేసీ బ్రో!!

జేసీ బ్ర‌ద‌ర్స్‌.. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, దివాక‌ర్‌రెడ్డి. వీరిద్ద‌రిలో ఎవ‌రు నోరువిప్పినా.. ఏవో ఒక సంచ‌ల‌న కామెంట్లు ఉంటాయి. వివాదాల‌కు కూడా కేంద్రంగానే ఉంటారు. ఏం మాట్లాడినా రాజ‌కీయంగా మంట‌లు రేపుతూనే ఉంటారు. ఇక‌, ఈ కోవ‌లో త‌న మ‌న అనే తేడా కూడా చూడ‌క‌పోవ‌డం.. సొంత పార్టీ అయినా.. నిప్పులు చెర‌గడం.. కూర్చున్న కొమ్మ‌ను న‌రుక్కోవ‌డం.. అంటే.. ఈ బ‌ద‌ర్స్‌ను చూస్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఇప్పు డు ఈ ప‌రంప‌ర‌లోనే మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ హీట్‌ను పెంచేశాయి.

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది చిత్తూరులో సాగుతోంది. దీనికి సంబంధించి టీడీపీ నాయ‌కులు.. పెద్ద ఎత్తున శ్ర‌మించ‌క‌పోయినా .. క‌నీసం ఉడ‌తా భ‌క్తిగా అయినా పాటుప‌డాలి క‌దా! ఎందుకంటే.. రేపు పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ప‌ద‌వులు అనుభ‌వించేది ఒక్క నారా లోకేష్ మాత్ర‌మే కాదుగా!! మ‌రి ఈ విష‌యాన్ని మ‌రిచిపోయారో.. ఉద్దేశ పూర్వకంగానే అన్నారో తెలియ‌దు కానీ.. ‘యువ‌గ‌ళంపై గొడ్డ‌లి వేటు’ అన్న‌చందంగా వ్యాఖ్యానించారు.

పాదయాత్రలపై తాజా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పందిస్తూ.. “ప్రస్తుతం పాదయాత్రలకు కాలం చెల్లింది. పాదయాత్రలను జనాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఎవరు పాదయాత్రలు చేసినా లాభం లేదు. గతంలో నాయ‌కులు చేసిన‌ పాదయాత్రలు వేరు. ఇప్పుడు చేస్తున్న పాద‌యాత్ర‌లు వేరు. ఇప్పుడు చేస్తున్న పాద‌యాత్ర‌ల‌న్నీ డబ్బుతో కూడుకున్న యాత్రలు” అని అన్నారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి అన్నారో.. ఏమో అనే మీమాంస క‌నిపిస్తున్నా.. టీడీపీ నాయ‌కులు మాత్రం ప‌రోక్షంగా జేసీని విమ‌ర్శిస్తున్నారు. యువ‌గ‌ళంపైనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని.. వైసీపీ ఒత్తిడికి త‌ట్టుకోలేక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా మారేందుకు జేసీ బ్ర‌ద‌ర్స్ రెడీ అవుతున్నార‌ని.. కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కీల‌క‌మైన పాద‌యాత్ర జ‌రుగుతున్న స‌మ‌యంలో సాయం చేయ‌క‌పోగా.. అసంద‌ర్భ వ్యాఖ్య‌లు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.