‘వివేకా హ‌త్య కేసు.. జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తే.. 10 రోజుల్లో ఫినిష్‌!!’

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అనేక మ‌లుపులు తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ.. త‌ర్వాత‌.. ఏకంగా సీఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఓఎస్‌డీ, భార‌తీ రెడ్డి పీఏ న‌వీన్‌ను కూడా దీనిలో పేర్కొంది. అయితే.. వైఎస్ వివేకా కేసులో మ‌రిన్ని నిజాలు.. త్వ‌ర‌లోనే బ‌ట్ట‌బ‌య‌లు కానున్నాయ‌ని.. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్యకేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తెలయ‌నున్నాయని, నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందని ద‌స్త‌గిరి చెప్పాడు. “ఇంతకాలం దస్తగిరి చెప్పింది అబద్దమని అని కొందరు అన్నారు. నేను చెప్పిన నిజాలు ఏమిటో ఇక తెలుస్తాయి” అని ద‌స్త‌గిరి తాజాగా వ్యాఖ్యానించాడు. ఇటీవల కొందరిని సీబీఐ అధికారులు విచారించారంటే సమాచారం ఉంటేనే కదా విచారణకు పిలిచి ఉంటారని దస్తగిరి అన్నాడు.

రాష్ట్రంలో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు కేసు బదిలీ చేయడం మంచిదేనన్నారు. హైదరాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు తీసుకునేందుకు సీబీఐ ఎదుటకు వచ్చానని దస్తగిరి పేర్కొన్నారు. కాగా, వివేకా హత్య కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసిన విష‌యం తెలిసిందే.

సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు నిందితులందరికీ సమన్లు జారీ చేశారు. ఈనెల 10వ తేదీన హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో చార్జిషీట్‌లోని ఐదుగురు నిందితులకు ఈ మేరకు సమన్లు జారీ చేశారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న సునీల్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిలకు సమన్లు జారీ అయ్యాయి. అలాగే అప్రూవర్‌గా మారిన ఏ4 నిందితుడు దస్తగిరికి సీబీఐ అధికారులు సమన్లు అందజేయనున్నారు.