ఉద్యోగుల ఎఫెక్ట్‌.. సీనియ‌ర్ అధికారిపై వేటు?

ఏపీలో ఉద్యోగులు వ‌ర్సెస్ ప్ర‌భుత్వానికి జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో సీనియ‌ర్ అధికారులు స‌త‌మత మ‌వుతున్నారా? ఏం జ‌రిగినా.. వారిదే బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం భావిస్తోందా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు కేఆర్ సూర్య‌నారాయ‌ణ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. త‌మ‌కు రావాల్సిన జీతాల‌ను 1వ తేదీ క‌ల్లా ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

తాము దాచుకున్న సొమ్మును కూడా స‌ర్కారు వాడుకుంటోంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న సంఘం నేత‌ల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేశారు. 1వ తారీకు న జీతాలు ఇచ్చేలా చ‌ట్టం చేయాల‌ని.. ఆదిశ‌గా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కూడా సూర్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. తాము దాచుకున్న సొమ్మును కూడా కోట్ల రూపాయ‌లను ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌కు వాడేసుకుంద‌న్నారు.

ఇక‌, దీనిపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హించ‌డం.. సంఘం ర‌ద్దు చేస్తామ‌ని పేర్కొన‌డం తెలిసిందే. దీంతో ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఉద్యోగుల‌కు అనుకూలంగా కూడా వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు తాజాగా ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఆర్ పీ సిసోడియాను అర్ధంత‌రంగా వేటు వేసింది. ఆయ‌న‌కు ఎలాంటి పోస్టు ఇవ్వ‌కుండా.. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి త‌ప్పించింది.

జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్‌(జీఏడీ)లో రిపోర్టు చేయాల‌ని ఆదేశించింది. అయితే.. ఇంత అర్ధంత‌రంగా ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం వెనుక‌.. రీజ‌నేంటి? అని ఆలోచిస్తే.. ఇటీవ‌ల ఉద్యోగులు వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డ‌మే కార‌ణ‌మ‌నే గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌బుత్వంపై ఉద్యోగులు ఆగ్ర‌హంతో ఉన్న స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలో సిసోడియా కీల‌క పాత్ర పోషించార‌ని.. ఆయ‌న అంగీకారంతోనే అప్పాయింట్‌మెంట్ ఖ‌రారైంద‌ని.. ప్ర‌భుత్వం భావించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై వేటు వేసింద‌నే టాక్ వినిపిస్తోంది.