కేసీఆర్ షాకింగ్ నిర్ణయం.. గవర్నర్ పై చర్యలకు హైకోర్టుకు!

దూరం పెరగటం అన్నది మొదలైతే.. అది అంతకంతకూ పెరుగుతుందన్న మాటకు తగ్గట్లే.. తాజాగా తెలంగాణలో పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ పై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఒక కీలక కారణాన్ని చూపుతూ హైకోర్టును ఆశ్రయిస్తోంది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను రంగంలోకి దించింది. దీనికి సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

ఇంతకీ ఈ తరహా నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకోవటానికి కారణం ఏమిటి? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి మూడున బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ.. అందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అనుమతి కోరుతూ జనవరి 21న గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ పంపింది. అయితే.. దీనికి గవర్నర్ తమిళ సై నుంచి అనుమతి వెళ్లలేదు.

దీనికి బదులుగా రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్లింది. దాని సారాంశం ఏమంటే.. బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టటానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని.. అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అన్న విషయాన్ని తెలపాలంటూ ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం సమాధానం కోరింది. అయితే.. దీనికి కేసీఆర్ సర్కారు స్పందించలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోకపోవటంతో వ్యవహారం చిక్కుముడి పడింది.

గత ఏడాది బడ్జెట్ సందర్భంగా కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా పూర్తి చేయటం తెలిసిందే. దీంతో గవర్నర్ గా తనకున్న అవకాశాల్ని తాజాగా తమిళ సై వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. గవర్నర్ నుంచి అనుమతి లేకుండా బడ్జెట్ ను ప్రవేశ పెట్టటానికి వీల్లేదు. ఈ కారణంగానే గవర్నర్ చేత బడ్జెట్ అనుమతించేలా తక్షణమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ రోజున (సోమవారం) తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది.

తాజా పరిణామాల నేపథ్యంలో.. ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. గవర్నర్ తరఫున మాట్లాడేవారు ఆమె సరైన పని చేశారని వాదిస్తుంటే.. గవర్నర్ తన పరిధిని ఎలా అతిక్రమిస్తారంటూ మరో వర్గం వాదనలు వినిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం ఉంటుందా? లేదా? అన్నది అత్యవసరం కాదని.. దానికి బదులుగా బడ్జెట్ ను నిలిపివేసేలా చర్యలు మంచిది కాదన్న మాట వినిపిస్తోంది.

ఈ సందర్భంగా గవర్నర్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్నారు. ప్రజా సంక్షేమం.. ప్రజాపద్దులను పరిగణలోకి తీసుకొని తాను బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈసారి మాత్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ఓకే చెప్పలేదు. అయితే.. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. గవర్నర్ ను వేలెత్తి చూపించే వేళ.. రాజ్యాంగ వ్యవస్థలో అందరూ ముఖ్యమైనప్పుడు.. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఎవరు ఎవరిని నియంత్రించేలా వ్యవమరించకుండా.. తమ పరిధులను దాటకుండా ఉంటే సమస్యే ఉండేది కాదు కదా? అన్న మాట వినిపిస్తోంది.

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తీరు చూసినప్పుడు.. కేసీఆర్ బోనులో నిలుచుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ తో సవాలచ్చ ఉండొచ్చు. అదంతా గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళ సైతోనే తప్పించి.. గవర్నర్ పదవితో కాదు కదా? అలాంటప్పుడు గవర్నర్ కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల్ని తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా? అది పక్కన పెట్టేసి.. తమ హక్కుల గురించి మాత్రమే మాట్లాడే ప్రభుత్వం.. తాను నిర్వర్తించాల్సిన బాధ్యత విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవద్దని ఎలా చెప్పగలుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభేదాలు తప్పేం కాదు. అలా అని.. ఎవరికి వారు తమ పరిధిని అతిక్రమించి వ్యవహరించటం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.