చంద్ర‌.. గిరి ఎక్క‌లేక పోతున్న ‘సైకిల్‌’ ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు. ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒక్క‌రే కుప్పం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీద‌క్కించుకుంది. అయితే ..ఇప్పుడు చంద్ర‌బాబుకు ప్రాణ‌సంక‌టంగా మారిన ఈ జిల్లాలో మ‌రోసారి వెలుగు వెల‌గాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ముఖ్యంగా టీడీపీని విమ‌ర్శించేవారికి చెక్ పెట్టాల‌నేది ఆయ‌న వ్యూహం.

మ‌రీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గంగా ఉన్న‌వారిని చిత్తుచిత్తుగా ఓడించాల‌నేది చంద్ర‌బాబు క‌ల‌. ఈ క్ర‌మంలోనే త‌న సొంత గ్రామం ..పుట్టిన నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిలో సైకిల్ ను ర‌య్ ర‌య్‌న తిప్పాల‌నేది వ్యూహం. కానీ, ఇది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఇంతింతై.. అన్న‌ట్టుగా.. ఇక్క‌డ వైసీపీ నాయ‌కుడు చెవిరెడ్డి భాస్క‌రెడ్డి రోజు రోజుకు ఇమేజ్ పెంచుకుంటున్నారు.

ఆయ‌న ఎక్క‌డా పెద్ద ఎత్తున స‌భ‌లు పెట్ట‌రు. అలాగ‌ని నిత్యం ప్ర‌జ‌ల్లోనూ ఉండ‌రు. దాదాపు వారంలో మూడు రోజులు తాడేప‌ల్లికి వ‌చ్చి.. సీఎం కుటుంబానికి అవ‌స‌ర‌మైన‌వి ఏర్పాటు చేసి వెళ్తుంటారు. ఇక‌, మిగిలిన నాలుగు రోజుల్లో మూడు రోజులు వ్యాపారాల‌కు కేటాయిస్తున్నారు. మ‌రి ఇంత బిజీగా ఉండ‌డంతో ఆయ‌న అస‌లు నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టడం లేదా? అంటే.. అన్నీ ఆయ‌న కుమారుడు చూసుకుంటున్నారు.

పార్టీల‌కు అతీతంగా.. అంద‌రికీ అన్నీ అనే ఫార్ములాను అవలంబిస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఉద్యోగుల‌కు, పారిశుధ్య కార్మికుల‌కు ఖ‌రీదైన బ‌ట్ట‌లు పెట్టారు. స్వీట్లు, హాట్లు పంచారు. ఇక‌, క‌రోనాస‌మ‌యంలో పేదా సాదా అనే తేడా లేకుండా ప్ర‌తి ఇంటికీ శానిటైజ‌ర్లు, మాస్కులు నెల‌కు రెండు సార్లు పంచారు. ఆనంద‌య్య క‌రోనా మందును ఇంటింటికీ స్వ‌యంగా అందించారు. దీంతో చంద్ర‌గిరిలో ఇప్పుడు ఎటు విన్నా చెవిరెడ్డి పేరు మార్మోగుతోంది. ప‌లితంగా టీడీపీ వాయిస్ వినిపించ‌డం లేదు. జెండా క‌నిపించ‌డం లేదు. ఇది నిజం!!