ఆ 22 మంది ఏమ‌య్యారు? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌!

మొత్తం 23 మంది నాయ‌కులు. అయితే, వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చ సాగుతోంది. వారే .. 2017-18 మ‌ధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంత‌కు చేరారు. స‌రే.. వీరిపై రాజ‌కీయ విమ‌ర్శ లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌నే అనుకున్నా.. వీరంద‌రికీ చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చారు.

నిజానికి వీరికి ఇవ్వొద్ద‌ని.. ఐదారుగురి విష‌యంలో ఫ‌ర్వాలేద‌ని చంద్ర‌బాబుకు నివేదిక‌లు అందాయి. అయిన‌ప్ప‌టికీ.. చేర్చుకునే క్ర‌మంలో ఇచ్చిన హామీ మేర‌కు ఆయ‌న వారికి టికెట్లు ఇచ్చారు. అయితే.. అప్ప‌టికే టీడీపీలో ఉండి.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించిన వారికి అన్యాయం జ‌రిగిందనే భావ‌న‌తో వారంతా రెబ‌ల్స్‌గా మారిపోయారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగి.. వీరంతా ఓడిపోయేలా చేశారు.

అయితే.. ఒక్క‌ అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో గొట్టిపాటి ర‌వి మాత్రం విజ‌యం ద‌క్కించుకున్నారు. 2020-21 మధ్య ఆయ‌న‌పైనా వైసీపీ ఒత్తిడి తెచ్చి పార్టీ మార‌మ‌ని సూచించినా.. ఆయ‌న మార‌లేదు. ఇది వేరే సంగతి. క‌ట్ చేస్తే.. మిగిలిన 22 మందిలో అమ‌ర్నాథ్‌రెడ్డి(ప‌ల‌మ‌నేరు), పితాని స‌త్య‌నారాయ‌ణ‌(ఆచంట‌), సుజ‌య్ కృష్ణ రంగారావు(బొబ్బిలి), వంత‌ల రాజేశ్వ‌రి(రంప‌చోడ‌వరం) వంటివారు మాత్రమే అప్పుడ‌ప్పుడు రాజ‌కీయంగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

మ‌రి మిగిలిన వారు ఏమైన‌ట్టు? అంటే.. వీరిలో ఆదినారాయ‌ణ‌(క‌డ‌ప‌) బీజేపీలో చేరారు. మిగిలిన వారు మాత్రం అస‌లు పార్టీలోనే ఉన్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే దీనికి కార‌ణం వారు బ‌య‌ట‌కు రారు. వ‌చ్చినా మాట్లాడ‌రు. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరు చేద్దామంటే.. క‌లిసి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికి మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. అయితే, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనేది సందేహంగా మార‌డ‌మే! ఇస్తార‌ని వీళ్లు.. ఇచ్చేది లేదని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు.