గాంధీ భవన్ షాక్‌కు గురైంది..

గాంధీ భవన్ షాక్‌కు గురైంది.. మెట్లెక్కనన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నడుచుకుంటూ లోనికి వచ్చేయడంతో ఆశ్చర్యపోయింది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు చెవులు కొరుక్కుంటూ గుసగులాడుకుంటూ మంతనాలు జరుపుకోవడంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులంతా ఏం జరుగుతోందో అర్థంకాక ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇదంతా చూసి పాత కాపు వి.హనుమంతరావు కొత్తగా అలక మొదలుపెట్టారు.

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే ‘హాత్ సే హాత్ జోడ్’ కార్యక్రమంపై చర్చించేందుకు గాంధీ భవన్‌కు వచ్చారు. ఆయన రమ్మని పిలవడంతో ఏడాదిగా గాంధీభవన్ మెట్లెక్కని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చారు. అంతేనా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇద్దరూ పక్కపక్క సోఫాల్లో కూర్చుని ఒకరికొకరు దగ్గరగా వచ్చి ఒకరి చెవిలో మరోకరు మాట్లాడుకున్నారు. పక్కనే మిగతా నేతలు ఉన్నా వారికి ఏమాత్రం వినిపించకుండా వీరు చెవులు కొరుక్కోవడంతో ఏం మాట్లాడుకున్నారా అని కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.

మాణిక్ రావ్ ఠాక్రే తనను ఫోన్ చేసి పిలవడంతో గాంధీ భవన్‌కు వచ్చానని కోమటిరెడ్డి చెప్పారు. తాను గాంధీభవన్ మెట్లెక్కబోనని ఎన్నడూ చెప్పలేదని.. నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇంతవరకు రాలేదని అన్నారు. అంతేకాదు.. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ వల్ల ప్రయోజనం లేదని.. అలాంటి సభలు కాంగ్రెస్ ఎన్నో పెట్టిందని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. కాగా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి సన్నిహితంగా మాట్లాడుకోవడం.. తాను నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నీకి మాణిక్ రావ్‌ను ఆహ్వానించగా ఆయన రాలేనని చెప్పడంతో సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం.. ఆ తరువాత మునుగోడు ఉప ఎన్నిక.. ఆ ఎన్నిక సమయంలో వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోవడం వంటి అనేక అంశాలతో పీసీసీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. మాణిక్ రావ్ ఠాక్రే తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు వెంకటరెడ్డిని పిలిచినప్పటికీ ఆయన గాంధీభవన్‌కు రానని.. బయటే కలుస్తానని చెప్పి ఆయన్ను బయటే కలిశారు. అయితే.. తాజాగా మాణిక్ రావ్ ఇప్పుడు కోమటిరెడ్డిని గాంధీభవన్‌కు రప్పించారు.