గుజ‌రాత్ అల్ల‌ర్లు-మోడీ-బీబీసీ.. తాజా వివాదం!

2002- సంవ‌త్స‌రంలో దేశంలో జ‌రిగిన కొన్ని కీల‌క ఘ‌ట్టాలేంటి? అన‌గానే వెంట‌నే గుజ‌రాత్‌లో చోటు చేసు కున్న అల్ల‌ర్లు, గోద్రా రైలు దుర్ఘ‌ట‌న అనేది తొలి వ‌రుస‌లో ఉంటుంది. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో దేశాన్ని ఈ ఘ‌ట‌న కుదిపేసింది. కొన్ని ఏళ్ల త‌ర‌బ‌డి దీనిపై విచార‌ణ‌లు సాగాయి. అప్ప‌టి ఈ మార‌ణ హోమం జ‌రిగిన స‌మ‌యంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీనే ఉన్నారు.

దీంతో ఈ వివాదం చుట్టూ ఆయ‌న‌.. ఆయ‌న చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్ట‌కేల‌కు రెండేళ్ల కింద‌ట‌.. మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విష‌యం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావిస్తున్న స‌మ‌యం లో అనూహంగా ఇప్పుడు బ్రిట‌న్‌కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై “ద మోడీ క్వ‌శ్చ‌న్‌” పేరుతో డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో మోడీ సీఎంగా ఉన్న స‌మ‌యాన్ని ప్ర‌స్తావించారు.

విశ్వ‌హిందూప‌రిష‌త్‌.. ఆర్ఎస్ఎస్‌లు క‌లిసి ఉమ్మ‌డిగా ఈ దారుణ మార‌ణ‌హోమాన్ని సృష్టించాయ‌ని పేర్కొన్న ఈ డాక్య‌మెంట‌రీ.. దీనికి బ‌ల‌మైన ఊతం మోడీనేన‌ని పేర్కొన‌డం భార‌త్‌కు మంటెత్తిస్తోంది. ముఖ్యంగా ‘విశ్వ‌గురువుగా’ కీర్తించ‌బడుతున్న మోడీకి భారీ సెగ పెట్టింది. అంతేకాదు.. మోడీ అండ చూసుకుని అవి రెచ్చిపోయాయ‌ని అందుకే 2002లో గుజ‌రాత్ అట్టుడికింద‌ని పేర్కొంది.

ఇక‌, ఈ డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నాని పేర్కొంది.