దేశ‌మంతా ఉచిత విద్యుత్‌: కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఖమ్మంలో జ‌రిగిన‌ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే.. దేశం మొత్తం రైతుల‌కు ఉచితంగా క‌రెంటు ఇస్తామ‌న్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేత‌లు దేశంలో మతపిచ్చి లేపుతున్నారని మండిప‌డ్డారు. బీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తే.. కేంద్రం తీసుకువ‌చ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని కూడా కేసీఆర్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేటు వ్యక్తులకా? అని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్‌ను బలపరచాలన్నారు. “విద్యుత్ కార్మికులారా? పిడికిలి బిగించండి. విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా.. మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తామ‌ని మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో ఆంధ్రుల హ‌క్కుగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని కేసీఆర్ తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మితే బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక కొంటామని అన్నారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి ప్ర‌జ‌ల‌కు మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని విమర్శించారు.

మేక్ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ విధానాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలు రూపొందిస్తున్నారన్నారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామ‌ని చెప్పారు.