దేశం ఆఫ్ఘ‌నిస్థాన్ అవుతోంది: కేసీఆర్ కామెంట్స్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల‌న‌లో దేశం ఆఫ్ఘ‌నిస్థాన్ మాదిరిగా త‌యార‌వుతోంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విద్వేషాలతో జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశాన్ని వక్రమార్గంలో పెట్టే దుష్టపన్నాగాలు ప‌న్నుతున్నార‌ని.. ఇలాంటి వారి కుటిల తంత్రాల‌ను.. యంత్రాంగాల‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించేయాల‌ని.. ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

మతపిచ్చి, విద్వేషాలతో ప్రజలను విడదీస్తే జాతి జీవనాడే దహించుకుపోయే పరిస్థితి తలెత్తి.. దేశం మరో ఆఫ్ఘ‌నిస్థాన్‌లా మారడం ఖాయ‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశ రాజకీయాలకు వెలుగుమార్గం చూపే అద్భుత చైతన్య వీచిక తెలంగాణ నుంచే వీయాలని.. దీనికి ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ముఖ్య‌మని కేసీఆర్ ఉద్ఘాటించారు. గిరిజన, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు.
 
ప్ర‌పంచంలో దేశం ఐదో స్థానంలో ఉంద‌ని చెబుతున్న కేంద్రం.. అప్పుల్లో కూడా అదే దారిలో వెళ్తోంద‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏం పాపం చేసింద‌ని.. ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వ‌కుండా అడ్డుప‌డుతున్నా ర‌ని మోడీని ఉద్దేశించి ప్ర‌శ్నించారు. “మ‌న క‌ష్టం మ‌నం తింటున్నాం.. మ‌న నీళ్లు మ‌నం తాగుతున్నాం.. మ‌న‌కు రావాల్సిన రొక్కం ఇయ్య‌మ‌ని కొరుతున్నాం.. అయినా.. కేంద్రంలోని గుడ్డి, చెవిటి ప్ర‌భుత్వం వినిపించుకోట‌ల్లేదు” అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

రాష్ట్రానికి మూడు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు కేంద్రం నుంచి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఈ విషయంపై తాను ప్ర‌శ్నిస్తే.. ఈడీ ఓడీ అంటూ.. బెదిరిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఫ‌లాలు పొందాలంటే.. ఇప్పుడు జ‌రుగుతున్న అభివృద్ధి ముందుకు సాగాలంటే.. ప్ర‌జ‌లు ఇలాంటి రాజ‌కీయ నేత‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ప‌రోక్షంగా బీజేపీపై విరుచుకుప‌డ్డారు.