కేంద్రం ముందు ప‌రువుపోతోందిగా.. జ‌గ‌న‌న్నా?!

కేంద్రం ముందు ఏపీ ప‌రువు పోతోందా? జ‌గ‌న్ పాల‌న‌పై కేంద్రం పెద్ద‌లు పెద‌వి విరుస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌ప్పుడు జ‌గ‌న్ చెప్పినంత‌, అడిగినంత అప్పులు చేసుకునేందుకు ప‌చ్చ‌జెండా ఊపిన కేంద్రం పెద్ద‌లు.. ఇప్పుడు క‌నీసంలో క‌నీసం స‌గం కూడా ఇవ్వ‌క‌పోవ‌డం.. అది కూడా.. ఆచి తూచి అనేక సార్లు బ్ర‌తిమాలించుకుని.. చివ‌రి నిముషంలో మొక్కుబ‌డిగా త‌లూప‌డం వంటివి చూస్తే.. కేంద్రం ముందు ప‌రువుతోంద‌ని అంటున్నారు.

తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీ ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించి..ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న్లు ఇవ్వాల్సి ఉంది. అయితే.. రాష్ట్రానికి వ‌చ్చిన ఆదాయం నుంచి వీటిని ఇవ్వొచ్చు క‌దా! అంటే.. ఇవ్వొచ్చు. కానీ, సామాజిక పింఛ‌న్ల కోసం వ‌చ్చిన ఆదాయాన్ని వ‌చ్చిన‌ట్టు మ‌ళ్లించారు. ఇక‌, ఇప్ప‌డు చేతిలో సాదా ఖ‌ర్చుల‌కు త‌ప్ప‌.. మ‌రోరూపంలో రూపాయికూడా లేదు.

ఈ నేప‌థ్యంలో వేత‌నాలు, పింఛ‌న్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వానికి సొమ్ములు అవ‌స‌రం. అదేస‌మ‌యంలో ఆర్బీఐ వ‌ద్ద తీసుకున్న అప్పులు కూడా తీర్చేయాల్సి ఉంది. ముఖ్యంగా వేజ్ అండ్ మీన్స్‌(తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌) కింద తీసుకున్న మొత్తం 5000 కోట్ల‌కు చేరుకుంది. ఇక‌, వేత‌నాలు, పింఛ‌న్ల‌కు 1500 కోట్లు కావాలి. ఈ నేప‌థ్యంలో కేంద్రం అనుమ‌తి ఇస్తే.. ఆర్బీఐ వ‌ద్ద సెక్యూరిటీలు వేలం వేయాల‌ని ఏపీ నిర్ణ‌యించుకుంది.

ఈ క్ర‌మంలో ఏకంగా 12 వేల కోట్ల‌కు అనుమ‌తి కోరింది. అయితే.. కేంద్రం ఇంత పెద్ద మొత్తం అనుమ‌తికి ఒప్పుకోలేదు. గీసి గీసి బేర‌మాడి.. చివ‌ర‌కు శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు సాగ‌దీసి 2000 కోట్ల అప్పున‌కు అంగీకారం తెలిపింది. దీంతో ప్ర‌భుత్వానికి కొంత ఊర‌ట అయితే ల‌భించినా.. అనుకున్న అప్పు మాత్రం పుట్టే అవ‌కాశం లేకుండా పోయింది. ఏదేమైనా.. ఒక‌ప్పుడు. కేంద్రం వ‌ద్ద ఉన్న ప‌లుకుబ‌డి.. ఇప్పుడు అడుగంటుతున్న వైనం చ‌ర్చ‌కు దారితీస్తోంది.