‘మా ఆయన పార్టీ మారితే నేనూ మారాల్సిందే’

ఏపీ మాజీ హోం మంత్రి, మహిళా దళిత నేత మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే కాదు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాజకీయంగా తమ ప్రయాణం వైసీపీతోనే అని చెప్తూనే తన భర్త నిర్ణయమే తన నిర్ణయమని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సుచరిత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారా అనేది చర్చనీయమవుతోంది. తానొక పార్టీలో తన భర్త ఇంకో పార్టీలో ఉండబోమని సుచరిత చెప్పారు.

2019లో జగన్ సీఎం అయిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో సుచరితకు హోం మంత్రి పదవి లభించింది. అయితే.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.. ఆమె అనుచరులు కూడా ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో భేటీ అయిన తరువాత ఆమె కాస్త నెమ్మదించారు. వైసీపీలోనే కొనసాగుతానని అప్పట్లో చెప్పారు. కానీ… పార్టీతో ఆమె అంటీముట్టనట్లుగానే ఉంటూ వచ్చారు. పార్టీ కూడా ఆమెను కలుపుకొనిపోయే ప్రయత్నమేమీ చేయలేదు.

గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన మేకతోటి సుచరిత మాస్ లీడర్ కానప్పటికీ వివాదరహితురాలిగా, మృదుస్వభావిగా పేరుండడంతో భారీ అనుచరగణం ఉంది. రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో 2003లో ఆమె పాదయాత్రలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2006లో ఫిరంగిపురం జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.

2009లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో రాజశేఖరరెడ్డి అక్కడి నుంచి సుచరితను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించారు. తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించారు. అయితే… రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆమె కాంగ్రెస్‌ను వీడి జగన్ పెట్టిన వైసీపీలో చేరారు. జగన్‌కు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2012 మే నెలలో ఉప ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికలలో ఆమె మళ్లీ గెలిచారు. అక్కడికి రెండేళ్ల తరువాత జరిగిన 2014 ఎన్నికలలో మాత్రం ఆమె ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ జగన్ ఆమెను మళ్లీ 2019లో టికెట్ ఇవ్వగా ఈసారి విజయం సాధించడంతో పాటు జగన్ గవర్నమెంటులో హోం మంత్రి అయ్యారు.

అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి పోవడంతో ఆమె వైసీపీపై ఆగ్రహంగా ఉంటున్నారు. ఆమె భర్త దయాసాగర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తుండడంతో వారి అడుగులు వైసీపీకి దూరమవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఐఆర్ఎస్ అధికారి అయిన దయాసాగర్ మధ్యప్రదేశ్‌లో పనిచేస్తూ రిటైర్ కావడంతో ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటరవుతున్నారు. వైసీపీతో అంతంతమాత్రంగా ఉండడంతో ఆయన టీడీపీతో సాగే అవకాశాలున్నాయన్న ప్రచారం గుంటూరు జిల్లాలో జరుగుతోంది.