సేవ చేయాలనుకున్నారు… బోల్తా పడ్డారు…

గుంటూరులో సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం విషాదంగా మారిన సంగతి తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మిస్ మేనేజ్ మెంట్ కారణంగా గందరగోళ పరిస్థితి ఏర్పడి తొక్కిసలాట జరిగిందని నిర్ధారించారు. ఉయ్యూరు ఫౌండేషన్ తరపున ఉయ్యూరు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతుల కుటుంబాలకు శ్రీనివాసరావు తక్షణమే 20 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించగా కోర్టు, రిమాండ్ ను తిరస్కరించింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని ఆదేశించింది.. ఈ నేపథ్యంలో అసలు ఉయ్యూరు శ్రీనివాసరావు ఎవరు, ఆయన సేవా కార్యక్రమాలేమిటన్న చర్చ మొదలైంది…

శ్రీనివాసరావు విద్యాధికుడు. గుంటూరు జిల్లా వేజెండ్లకు చెందిన ఆయన వర్జీనియాలో స్థిరపడ్డారు. పుట్టిన గడ్డకు ఏదో చేయాలన్న తపన ఆయనలో ఉంది. తన ఆస్తిలో కోట్లాది రూపాయలు వెచ్చింది ఏపీలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఉయ్యూరు శ్రీనివాసరావు, ఆ పెద్దాయన పేరుతో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు విదేశీ విద్య అందించే లక్ష్యంలో ప్రతీ ఏటా వేలాది డాలర్లు వ్యయం చేస్తున్నారు. బ్యాంకులు ఇవ్వని లోన్లును ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా మంజూరు చేస్తూ…. చదువు పూర్తయి ఉద్యోగాలు చేసేప్పుడు తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు…

అన్న క్యాంటీన్లు నిర్వహణ

శ్రీనివాసరావు గుంటూరు, హిందూపురంలో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తూ రోజూ వందల మందికి అన్నదానం చేస్తున్నారు. . అన్నంతో పాటు పప్పు కూర, రోటి పచ్చడి, సాంబారు, ఒక మిఠాయి, పెరుగును వడ్డిస్తున్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను విస్తరించే కార్యక్రమం చేపట్టాలనుకున్నారు..

భవిష్యత్ కార్యక్రమాలు ఆగిపోవాల్సిందేనా..

తొక్కిసలాట ఘటనతో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. నిజానికి 18 వేల మందికి సంక్రాంతి కానుకలు పంపిణీ చేయాలనుకుని ఏర్పాట్లు చేశారు. ఎంత బయటకు చెప్పకపోయినా టీడీపీ కార్యక్రమంగానే దాన్ని కొనసాగించాలనుకున్నారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు వారికి సహకరించలేదు. దానితో గందరగోళ పరిస్థితి ఏర్పడి.. తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. సక్రాంతి తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొబైల్‌ అంబులెన్స్‌ ద్వారా మురికి వాడల్లో వైద్య సేవలు అందించాలనుకున్నారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని జనవరి 18న 35 వేల మందికి అన్నదానం చేయాలనుకున్నారు. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన మంచినీరు అందించాలనుకున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత ఈ కార్యక్రమాల నిర్వహణ అనుమానంగానే ఉంది…

అసలు ఉద్దేశం ఏమిటి ?

ఉయ్యూరు శ్రీనివాసరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్త. ఆయన టీడీపీ తరపున పోటీ చేయాలనుకున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే అది నిజం కాదని శ్రీనివాసరావు సన్నిహితులు చెబుతున్నారు. కేవలం సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకోవాలన్న కోరిక మాత్రమే ఆయనకు ఉందని అంటున్నారు. అయితే సంక్రాంతి కానుకల విషయంలో మాత్రం ఒక పొరపాటు జరిగిన మాట వాస్తవం. అందులో టీడీపీ నేత ఆలపాటి రాజా రాంగ్ డైరక్షన్ ఉందని చెబుతున్నారు.

తెనాలి నుంచి పోటీ చేయాలనుకున్న ఆలపాటి రాజాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. టీడీపీ- జనసేన పొత్తు కుదిరితే తెనాలి నియోజకవర్గాన్ని నాదెండ్ల మనోహర్ కు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలని ఆలపాటి రాజా అనుకున్నారు. అందుకే అక్కడ టీడీపీ పరపతి పెంచేందుకు కానుకల కార్యక్రమాన్ని ఉయ్యూరు శ్రీనివాసరావుకు చెప్పి… గుంటూరు వెస్ట్ పరిధిలో పెట్టించారు. అనుకున్నదొక్కటీ, ఐనదొక్కటీ అన్నట్లుగా అసలు సంగతే బెడిసికొట్టింది. రాజా బాగానే ఉన్నారు… శ్రీనివాసరావు ఇబ్బందుల్లో పడ్డారు…