క‌ర్ణాట‌క ఫొటోతో జ‌గ‌న్‌కు ఎలివేష‌న్ ఇవ్వ‌బోయి..

Corona

సోష‌ల్ మీడియా కాలంలో ఏది నిజం.. ఏది ఫేక్ అని తెలుసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మైపోయింది. ఎక్క‌డెక్క‌డి ఫొటోలో తెచ్చి ఇక్క‌డివ‌ని చూపించి ఎలివేష‌న్లు ఇస్తుంటారు.. అలాగే అప్ర‌తిష్ట పాలు చేయ‌డానికీ ఇలాంటివి ఉప‌యోగించుకుంటుంటారు. తెలిసో తెలియ‌కో కొంద‌రు ఉన్న‌త స్థాయి వ్య‌క్తులు కూడా ఇలాంటి పొర‌బాట్లు చేస్తుంటారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల్లో ఒక‌రైన రాజీవ్ కృష్ణ కూడా ఇలాగే చేశారు. అనంత‌పురంలో 1500 ప‌డ‌క‌ల‌తో కోవిడ్ ఆసుప‌త్రిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంత బాగా సిద్ధం చేసిందో చూడ‌మంటూ ఆయ‌న ఒక ట్వీట్ వేశారు. అందులో లోప‌ల బెడ్ల‌తో, అత్యాధునిక వ‌స‌తుల‌తో ముస్తాబైన ఆసుప‌త్రి ఫొటోలు కూడా పెట్టారు. ఆ ఫొటోల మీద జ‌గ‌న్ చిత్రాన్ని కూడా పెట్టి ఆయ‌న‌కు ఎలివేష‌న్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ ఆయ‌న షేర్ చేసిన ఫొటో అనంత‌పురానిది కాద‌ని సోష‌ల్ మీడియా జ‌నం ప‌ట్టేశారు. క‌ర్ణాట‌క‌లో హెచ్సీఎల్ సంస్థ ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుప‌త్రి ఫొటోల‌వ‌ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. దీనిపై విమ‌ర్శ‌కులు, వ్య‌తిరేకులు చెల‌రేగిపోయారు. వైకాపా వాళ్లు ఇలాంటి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌తో క్రెడిట్ తీసుకోవ‌డం మామూలే అంటూ పాత‌, కొత్త విష‌యాల్ని బ‌య‌టికి తీసి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐతే విష‌యం కాసేప‌టికే అంతా పాకిపోవ‌డంతో రాజీవ్ కృష్ణ అప్ర‌మ‌త్తం అయ్యారు.

హుందాగా త‌ప్పు ఒప్పుకున్నారు. ఆ ఫొటో వేరే సోష‌ల్ మీడియా గ్రూప్ షేర్ చేయ‌డం వ‌ల్ల త‌ప్పు జ‌రిగింద‌ని.. నిజాయితీగా త‌ప్పును అంగీక‌రిస్తున్నాన‌ని.. ఆ ట్వీట్‌ను డెలీట్ చేస్తున్నాన‌ని మ‌రో ట్వీట్ వేశారు. తెలిసి చేశారో తెలియ‌క చేశారో కానీ.. త‌న త‌ప్పును హుందాగా అంగీక‌రించి ఈ వివాదానికి ఇంత‌టితో తెర‌దించారు రాజీవ్ కృష్ణ‌.