ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంపీటీసీ… అధికారం అంటే అహంకారమా?

తెలుగు రాష్ట్రాలలో కొందరు రాజకీయ నాయకులే కాదు.. కొందరు అధికారులూ విచక్షణారహితంగా పనిచేస్తున్నారు. తాజాగా బుధవారం ఉదయం పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలే కనిపించాయి. ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీటీసీ అధికార గర్వంతో చేసిన పనులు చర్చనీయమయ్యాయి.

ఎమ్మెల్యే:
తెలంగాణలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మందమర్రి వద్ద టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీ టీవీ విజువల్స్‌లోనూ దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం దాడి చేసింది ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యేనంటున్నారు. అయితే… ఆయన మాత్రం తాను ఎవరిపైనా దాడి చేయలేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. హైవే పనులు పూర్తికాకుండానే టోల్ వసూలు చేస్తున్నందుకు ప్రశ్నించేందుకు వెళ్తే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నది ఆయన క్లెయిం.

ఎంపీటీసీ:
ఇక ఏపీలో జరిగిన మరో సంఘటన వైసీపీకి చెందిన ఎంపీటీసీ ఒకరు పెట్రోలు బంకు సిబ్బందిని దారుణంగా కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. “దళితులపై వైసిపి నేతల దమనకాండ కొనసాగుతూనే ఉంది. కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ కొట్టడం కుదరదు అన్నందుకు దళిత యువకుడు తేజపై అత్యంత దారుణంగా తన అనుచరులతో కలిసి దాడి చేశాడు బొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేశ్ నాయుడు” అంటూ లోకేశ్ వీడియో సహా ట్వీట్ చేశారు.

కలెక్టర్:
ఈ రెండు ఘటనలూ ఆయా రాష్ట్రాలలో అధికార పార్టీ నేతల తీరుకు ఉదాహరణగా నిలిస్తే మూడో ఘటన అధికారుల విచక్షణారాహిత్యానికి పరాకాష్ఠగా నిలిచింది. రాజకీయ నేతల నేపథ్యాలు వేరు… చదువుకున్నవారు ఉంటారు, చదువులేని వారు ఉంటారు… రాజకీయాల్లోకి రాకముందు వారి నేపథ్యాలు కూడా అందరివీ ఒకేలా ఉండకపోవచ్చు… నేర స్వభావం ఉన్న నేతలూ వందల సంఖ్యలో ఉన్నారు. కానీ, సివిల్ సర్వెంట్ల పరిస్థితి వేరు. బాగా చదువుకుని ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంలో ఉద్యోగంలోకి వస్తారు.

చట్టాలు, నిబంధనలలో కొన్ని కఠినమైనవి ఉండొచ్చు.. కానీ, పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి, అమాయకత్వం వల్ల నిబంధనలు పాటించనివారిని అర్థం చేసుకుని వదిలేయడం, లేదంటే అవగాహన కల్పించడం వంటి విచక్షణాయుతమైన పద్ధతులుంటాయి. కానీ… తెలంగాణలోని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణప్రసాద్ మాత్రం ఎందుకో ఇదంతా మరిచినట్లున్నారు. తన వాహనానికి రోడ్డుపై గేదెలు అడ్డంగా రావడంతో వాటిని కాస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

అంతేకాదు… కాపలాదారుడికి ఫైన్ వేయించారు. గంపోనిగూడెంకు చెందని బోయని యాకయ్య బోరు నరసాపురానికి చెందిన రైతుల పాడి గేదెలను అడివి వైపు తీసుకెళుతుండగా కలెక్టర్ వాహనం వచ్చింది. కలెక్టర్ వాహనానికి అడ్డుగా పశువులు వచ్చాయి. డ్రైవర్ హారన్ కొట్టినా అవి తొలగకపోవడంతో కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు కోపమొచ్చింది. వెంటనే యాకయ్యపై కలెక్టర్ మండి పడ్డారు. అంతటితో ఆగితే బాగుండేది. కానీ అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు యాకయ్యకు ఫైన్ వేశారు. ఏకంగా రూ.7500లు ఫైన్ వేశారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష తప్పదని అధికారులు యాకయ్యను హెచ్చరించారు. అతని ఇంటి నల్లా కనెక్షన్ ను కూడా తొలగించారు.
ఇదీ అధికారం తీరు.