తెలంగాణ మంత్రులు క‌రెంటు దొంగ‌లు : పేర్ని నాని

తెలంగాణ మంత్రుల పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏపీకి వ‌చ్చి.. ఇక్క‌డ‌ ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల నుంచి దొంగ కరెంట్ తీసుకుంటున్న దొంగ‌లు.. అని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయడంలో తప్పు లేదని.. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశాడని.. వీరి ప‌రిస్థితి కూడా అంతేన‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా ఎప్పుడొస్తారోనని తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని స్పందిస్తూ.. గ‌తంలో పాల్ పార్టీ పోటీ చేసింది. జ‌న‌సేన పోటీ చేసింది.. ఏం సాధించారు. ఇప్పుడు వీళ్లూ అంతే! అని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని, ఏపీని తెలంగాణ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏపీకి చెందిన ఆస్తులు పంచారా? డబ్బులిచ్చారా? విద్యుత్ బకాయిలు చెల్లించారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏపీలోనూ బీఆర్ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తోందన్న మ‌ల్లారెడ్డి.. అక్క‌డ ఓట‌మి భ‌యంతోనే ఏపీపై ఇలా వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని, త్వరలో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని మ‌ల్లారెడ్డి చెప్ప‌డంపై.. అది ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం అయి ఉంటుంద‌ని పేర్ని అన్నారు.

ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా కూడా రాలేదని పేర్కొన‌డంపై పేర్ని స్పందిస్తూ.. వీటికి తెలంగాణ ప్ర‌భుత్వ‌మే అడ్డు ప‌డుతోంద‌ని.. కొన్ని నిజాలు చెబితే.. త‌ల ఎక్క‌డ పెట్టుకుంటారో.. అని దుయ్య‌బ‌ట్టారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం తరహాలో ఏపీలోనూ పోలవరాన్ని పూర్తి చేస్తామన‌డంపై.. మాట్టాడుతూ.. ముందు.. దానిని పూర్తి చేయ‌మనండి.. అని వ్యాఖ్యానించారు.