కేసీఆర్ స‌ర్‌కి నిద్ర కూడా ప‌ట్ట‌దుగా… అంత‌లా ఆకాశానికి!!

అదేంటి చిత్రంగా! అనుకుంటున్నారా? అంతే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను త‌న సొంత పార్టీ వారే పొగుడుతున్నారు. ఇక మిగిలిన వారు ఎవరూ కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌ను అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నా.. ఎవ‌రూ ప‌న్నెత్తు పొగ‌డ్త కూడా పొగ‌డడం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా.. తాను ఊహించ‌ని రీతిలో దేశ ప్ర‌థ‌మ పౌరురాలు.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.. కేసీఆర్‌ను ఏకంగా.. ఆకాశం దాటించి.. అంత‌రిక్షం వ‌ర‌కు అన్న‌ట్టుగా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

ముఖ్యంగా కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రైతు బంధు ప‌థ‌కంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఒక‌వైపు మోడీ స‌హా.. బీజేపీ నేత‌లు తిట్టిపోస్తుంటే.. మ‌రోవైపు.. రాష్ట్ర‌ప‌తి కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేయ‌డంతో కేసీఆర్ స‌ర్‌కి.. నిద్ర కూడాప‌ట్టదుగా! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ రాష్ట్ర‌ప‌తి ఏమ‌న్నారు..ఏం పొగిడారంటే..

గిరిజనులు, ఆదివాసీల కోసం ప్రతి ఏడాది రైతుబంధు ద్వారా ఎనిమిదిన్నర లక్షల మందికి ఇప్పటివరకు రూ.7,349 కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం అందించినట్లు రాష్ట్ర‌ప‌తి చెప్పారు. గిరిజన, ఆదివాసులకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందుతోందని.. ఆరోగ్య వసతుల కోసం 437 ఉపకేంద్రాలు, 32 బర్త్ వెయిటింగ్ రూములు, ఏడు డయాగ్నొస్టిక్ హబ్లను నిర్మించినట్లు తెలిపారు.

ఆదిమ గిరిజన తెగల ప్రాంతాల్లో 31 పాఠశాలలు, కోలముల కోసం ప్రత్యేక ప్రాథమిక, సైనిక పాఠశాలలు, న్యాయవిద్య, ఫైన్ ఆర్ట్స్ కొరకు ప్రత్యేక కళాశాలల ఏర్పాటుతో పాటు దివ్యాంగుల కొరకు ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 918 మంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందినట్లు పేర్కొన్నారు.

సీఎం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం కింద 205 మంది యువతకు ఎనిమిది విభాగాల్లో సహకారం అందించినట్లు వెల్లడించారు. అందులో ఐదుగురు ఆదిమ గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారని ఇది చాలా సంతోష‌క‌ర‌మ‌ని ఆమె పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించారు. లక్షా 40 వేల మంది గిరిజన యువతులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,126 కోట్ల ఆర్థిక సాయం అంద‌డం సాధార‌ణ విష‌యం కాద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.