కేసీఆర్ పార్టీ ఖ‌జానా క‌ళ‌క‌ళ‌.. రాష్ట్ర ఖ‌జానా విల‌విల‌!!

తెలంగాణ రాష్ట్ర ఖ‌జానాను చూస్తే.. విలవిల‌లాడుతోంది. మొన్న‌టికి మొన్న రాష్ట్ర మంత్రి తన్నీరు Harish Rao.. ఒక ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. జీతాలు ప‌డ‌లేద‌ని బెంగ వ‌ద్దు.. మా వ‌ద్ద ఉంటే.. బ్యాంకులో ఉన్న‌ట్టే రెండు రోజులు ఆల‌స్య‌మైతే.. స‌ర్దు కోవాలే..! అనేసి ఒక్క న‌వ్వు న‌వ్వేశారు. దీనిని బ‌ట్టి రాష్ట్ర ఖ‌జానా ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధ‌మై పోతోంది. ఇక‌, ఇత‌ర చిన్న చిన్న ప‌నులు చేయించుకున్న కాంట్రాక్ట‌ర్ల‌కు కూడా ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌డం లేదు.

ఇదే విష‌యాన్ని కాంట్రాక్ట‌ర్లు ఎత్తి చూపుతూ.. అయ్యా మేం ప‌నులు చేయ‌లేం! అనితేల్చి చెప్పారు. ఎంత దాచాల‌న్నా.. ఈ విష‌యాలు ఎందుకో దాగ‌లేదు. ఇందులో ఏమీ విప‌క్షాల కుట్ర లేదు. ఖ‌జానా మాత్రం బోసిపోతోంది!! అయితే, అదేస‌మ‌యంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఆదాయం మాత్రం కోట్ల‌కు కోట్ల‌కు తారాజువ్వ మాదిరిగా పెరిగిపోతోంది. మ‌రి ఇది ఎలా సాధ్యం అన్న‌దే ఇప్పుడు తొలి చేస్తున్న కీల‌క ప్ర‌శ్న‌.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్‌ రిపోర్టు ప్రకారం పార్టీ ఆదాయం 2021-2022 మధ్యకాలంలో రూ.37.65 కోట్ల నుంచి ఏకంగా రూ.218.11 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు పార్టీ ఈ నివేదికలో వెల్లడించింది. ఈ రెండు మార్గాల్లో గత ఏడాది ఎలాంటి ఆదాయం లేదు.

ఇదే సమయంలో పార్టీ మొత్తం ఆస్తుల విలువ ఏడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 12 నెలలకు మించి కాల పరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో పార్టీ 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్ల మేర ఉన్నాయి. మొత్తానికి KCR పాలిత‌ రాష్ట్రం అప్పులు చేసే ప‌రిస్థితి ఉన్నా.. పాల‌క ప‌క్షం మాత్రం నిధుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుండ‌డం వివాదానికి దారితీస్తోంది.