వేడుక‌ల వేళ వైసీపీలో ర‌చ్చ ర‌చ్చ‌!!

ఒక‌వైపు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు..మ‌రోవైపు వైసీపీ నేత‌ల్లో నెల‌కొన్న అసంతృప్తి, ఆధిప‌త్య ధోర‌ణి త‌దిత‌ర అనేక అంశాలు ర‌చ్చ ర‌చ్చ సృష్టించాయి. హిందూపురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు వైసీపీ నేత‌లు ఎంత మంది క‌లివిడిగా ఉన్నారు.? ఎంత మంది దూరంగా ఉన్నారు? అనే విష‌యాలు ఈ వేడుక‌ల సాక్షిగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నువ్వా నేనా అనే సంస్కృతికి పార్టీ క‌డు దూర‌మ‌ని.. అంద‌రూ క‌లివిడిగా ఉంటార‌ని ఒక పేరుంది.

అయితే, తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు మాత్రం అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు వైసీపీ మాత్రం అతీతం కాద‌ని నిరూపించిన‌ట్టు అయింది. శ్రీకాకుళంలో స్పీక‌ర్‌, మంత్రులు సీదిరి అప్ప‌ల‌రాజు, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావులు ఎవ‌రికి వారే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి మ‌మ అనిపించారు. విజ‌య‌న‌గ‌రంలో పార్టీ కీల‌క నాయ‌కురాలుగా జ‌గ‌న్ కొన్ని రోజుల కింద‌టే పేర్కొన్న కిల్లి కృపారాణి నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి మిగిలిన నాయ‌కులు డుమ్మా కొట్టారు.

విజ‌య‌వాడ‌లో మ‌ల్లాది విష్ణు పాల్గొన్న కార్య‌క్ర‌మానికి ఇత‌ర నేత‌లు డుమ్మా కొట్టారు. ఇత‌ర నేత‌ల కార్య‌క్ర మాల‌కు మల్లాది కూడా గైర్హాజ‌ర‌య్యారు. తిరుప‌తిలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. కీల‌క‌మైన మాచ‌ర్ల‌లో అస‌లు సంద‌డే క‌నిపించ‌లేదు. ఇటీవ‌లే ఇక్క‌డ టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ వివాదం న‌డిచిన విష‌యం తెలిసిందే. అలాంటి చోట వైసీపీ అధినేత జ‌న్మ‌దిన వేడుక‌ల ఊపు పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

ఇక‌, హిందూపురంలో ఎవ‌రికివారే య‌మునా తీరే అన్న‌ట్టుగా ఇక్క‌డ మూడు వ‌ర్గాలు ముచ్చ‌ట‌గా.. ప‌క్క ప‌క్కనే పందిళ్లు వేసి మ‌రీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. కానీ, ఏంలాభం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ కేంద్రంగా విమ‌ర్శ‌లు.. వివాదాల‌తోనే స‌రిపోయింది. మొత్తంగా చూస్తే.. సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌లు.. నాయ‌కుల బ‌లాబలాలు నిరూపించుకునేందుకు, ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శించేందుకు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం గ‌మనార్హం.