`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే కేంద్రంగా శ్రీకారం చుట్టారు. దీప్కే త‌న సొంత గ్రామం మ‌హారాష్ట్ర‌లోని పంప్రిలో ఉన్న పాఠ‌శాల‌ల‌ను శ‌నివారం సంద‌ర్శించారు. పాఠ‌శాల‌లో దుస్థితిని ప‌రిశీలించారు. మౌలిక స‌దుపాయాల‌పై చ‌ర్చించారు. గ్రామ‌స్తుల‌తో భేటీ అయ్యారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌పై చ‌ర్చించారు. అనంత‌రం.. పాఠ‌శాల‌లు ఉన్న ప్రాంతాల్లో త‌న బృందంలో ప‌ర్య‌టించారు. దేశ‌వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నామ‌న్నారు.

ఇటీవ‌ల త‌మ రెండో సెష‌న్ ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌క‌టించిన దీప్కే.. ఈ సారి ల‌క్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠ‌శాల‌ల్లో విద్యావ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్ద‌డ‌మేన‌ని ప్ర‌క‌టించారు. దీనికి స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌ల రోజే శ్రీకారం చుట్ట‌డం గ‌మ‌నార్హం. దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ పాఠ‌శాల‌ల దుస్థితిని తెలుసుకుని, వాటిలో మౌలిక స‌దుపాయాలు.. విద్య నాణ్య‌త‌, విద్యార్థుల అభ్య‌స‌నాల‌ను ప‌రిశీల‌న చేయ‌నున్నారు. అనంత‌రం.. ఆయా పాఠ‌శాల‌ల అభివృద్ధిపై ప్ర‌భుత్వాల‌కు దిశానిర్దేశం చేయ‌డంతో పాటు.. వాటిని కార్యాచ‌ర‌ణ చేప‌ట్టేలా ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తీసుకురానున్నారు.

మ‌రోవైపు.. `ప్ర‌జ‌ల మాట వింటాం` పేరుతో మ‌రో కార్య‌క్ర‌మం కూడా స్వాతంత్ర దినోత్స‌వం నుంచే ప్రారంభమైంది. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తారు. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల‌నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని ప్ర‌భుత్వాల‌కు చేర వేస్తారు. అనంత‌రం.. వాటిపైనా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌నున్నారు. అయితే.. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌ను ఇండిపెండెంటుగానే చేప‌ట్ట‌నున్న‌ట్టు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ప్ర‌క‌టించింది. రాజ‌కీయాలు, నాయ‌కుల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని పేర్కొంది. అయితే.. వారు ఎలుగెత్తే అంశాల‌కు.. త‌మ‌కు సారూప్యం ఉంటే.. వాటికి త‌మ‌కు సంబంధం ఉండ‌ద‌ని కూడా తెలిపింది.

మ‌రో సారి ర‌గ‌డ‌!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ అధినేత దీప్కే.. కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ సోష‌ల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్‌ను శ‌నివారం నిలిపి వేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. సుమారు అర‌గంట పాటు త‌మ సోష‌ల్ మీడియా ర‌ద్ద‌యింద‌ని.. అదేస‌య‌మంలో ప్ర‌ధాని ఎర్ర‌కోట‌పై నుంచి ప్ర‌సంగిస్తున్నార‌ని తెలిపారు. త‌మ అభిప్రాయాల‌ను చెప్పుకొనేందుకు వీలు లేకుండా.. త‌మ గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. `మీరు ఎంత‌గా మ‌మ్మ‌ల్ని అణిచి వేస్తే.. మేం అంత‌గా విజృంభిస్తాం. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నిస్తాం. స‌మ‌స్య‌లు లేవ‌నెత్తుతాం.“ అని ప్ర‌క‌టించారు.