క్రైస్తవం లేకపోతే ఇండియాకు మార్గమే లేదు – హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ అంటే.. రాష్ట్రం మొత్తం వైద్య శాఖ‌కు మంత్రి త‌ర్వాత మంత్రి లెక్క క‌దా! కానీ, ఈయ‌న ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో త‌ల‌దూరుస్తున్నాడ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. చ‌ర్య‌ల‌తో ఆయ‌న త‌ర‌చుగా మీడియాలోనూ క‌నిపిస్తున్నారు. తాజాగా ఆయ‌న క‌రోనా మ‌హ‌మ్మారిపై చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేశాయి. ప్ర‌పంచం నుంచి క‌రోనా పోయిందంటే.. అది ఏసు ప్ర‌భువు ద‌య‌వ‌ల్లేన‌ని ఆయ‌న ఏమాత్రం త‌డుముకోకుండా చెప్పారు. అంతేకాదు, క్రైస్తవం లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాగించలేకపోయేదన్నారు.

క్రైస్తవం ద్వారా ఆనాడు ఆధునిక విద్య, వైద్యం తీసుకురాక పోయి ఉంటే… దేశం అభివృద్ధి చెంది ఉండేది కాదని సెల‌విచ్చారు. దీంతో నెటిజ‌న్లు ఒక్క‌సారిగా రియాక్ట్ అయ్యారు. దేశంలో వ్యాక్సిన్లు, మాస్కులు.. ఎందుకు వినియోగించారో సార్‌కే తెలియాల‌ని నెటిజ‌న్లు ఎదురు దాడి చేశారు.

ఉమ్మ‌డి ఖ‌మ్మం కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎన్‌ఆర్ ట్రస్ట్ పేరుతో నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులు.. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రిలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వ‌హించారు. దీనికి రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. అంతటితో ఆగని ఆయన దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని తెలిపారు. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే, అస‌లు శ్రీనివాస్ ఇటీవ‌ల కాలంలో ఏదో ఓ వివాదంలో క‌నిపిస్తూ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆ మధ్య ఖమ్మంలో శ్రీనివాస్‌ క్షుద్రపూజలు చేశారనే వాద‌న బ‌లంగా వినిపించింది. దేవుడు కరుణిస్తాడంటూ విచిత్ర పూజలు నిర్వహించిన వీడియోలుకూడా వైర‌ల్ అయ్యాయి. దేవతనని ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే విషయం బయటకు రావడంతో శ్రీనివాస్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల రాష్ట్రంలో ఒకే రోజు 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాస్ నిమిషం వ్యవధిలోనే రెండు సార్లు కేసీఆర్ కాళ్లు మొక్కారు. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసమే శ్రీనివాస్ ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి.