పీఏసీకి పొగ‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతే గురూ!!

పీఏసీ.. ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ.. ఇది ఏ రాష్ట్రంలో అయినా.. ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, వ్య‌యాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు నిశితంగా ప‌రిశీలిస్తూ.. హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం.. ప్ర‌జ‌లు ప‌న్నుల ద్వారా క‌డుతున్న సొమ్మును ప్ర‌భుత్వాలు ఎలా ఖ‌ర్చు చేస్తున్నాయో.. లెక్క‌లు కోర‌డం.. దానిని మదింపు చేయ‌డం, శాస‌న స‌భ‌కు వివ‌రించ‌డం.. ముఖ్యంగా స్పీక‌ర్‌కు నివేదిక అందించ‌డం అనేది పీఏసీ ప‌ని. ఇదేమీ.. ఊరికేనే ప‌నిలేక ఏర్పాటు చేసిన క‌మిటీ కాదు. శాస‌నస‌భ‌, కాగ్ నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌తిరాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాల‌నే నిబంధ‌న ఉంది.

పార్ల‌మెంటులో అయితే.. పీఏసీని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల విష‌యంలో పీఏసీ అన్న మాటే వినిపించ‌డం లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. పీఏసీని ఏర్పాటు చేశారు. అయితే. దీనికి సంబంధించి ఇటు శాస‌న స‌భ‌కానీ, అటు ప్ర‌భుత్వం కానీ.. ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రెండు రాష్ట్రాల్లోనూ పీఏసీలు సుప్త‌చేత‌నావ‌స్థ‌ను ఎదుర్కొంటున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో పీఏసీని ఏర్పాటు చేశారు. దీనిలో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కటంటే ఒక్క స‌మావేశం నిర్వ‌హించ‌లేదు. దీనిని ప్ర‌శ్నించేవారు కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న ఎంఐఎం.. అధికార పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉండ‌డ‌మేన‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌జాధనాన్ని ఇష్టానుసారం ఖ‌ర్చు చేసిన అడిగే నాథుడు లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌.. పీఏసీ చైర్మ‌న్‌గా ఉన్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. కేశ‌వ్ బలంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం పీఏసీకి స‌హ‌క‌రించ‌డం లేద‌నే విమ‌ర్శలు వున్నాయి. పీఏసీలో మొత్తం 12 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో అస‌లు ఏడుగురిని నియ‌మించ‌నేలేదు. పోనీ.. ఏదో ఒక విదంగా స‌మావేశం అవుదామ‌న్నా.. మిగిలిన స‌భ్యుల‌ను స‌మావేశాల‌కు వెళ్ల‌కుండా స‌ర్కారు అడ్డంకులు సృష్టిస్తోంద‌నే వాద‌న ఉంది. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ పీఏసీ గురించి అడిగేవారు.. ప‌ట్టించుకునే వారు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.