బీఆర్ఎస్ తొలి పరీక్ష అక్కడే..

కేసీఆర్ కేంద్రంతో కయ్యం పెట్టుకుని తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చారు. ఇందకు ఎన్నికల కమిషన్ అనుమతులూ రావడంతో ఈ రోజు భారీస్థాయిలో ఆవిర్భావ ఉత్సవమూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేడీ(ఎస్) నేత హెచ్‌‌డీ కుమారస్వామి హాజరయ్యారు. దేశ రాజకీయాల్లో స్థానం సంపాదించాలని.. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఇదంతా చేస్తున్నారు. అయితే, జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎదగాలంటే తెలంగాణకు వెలుపలా ఆ పార్టీ పోటీ చేయాలి. ఆ లెక్కన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తే ఆ పార్టీ ఎదుర్కొనబోయే మొదటి ఎన్నికలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే అవుతాయి.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు నిన్ననే ఎన్నికలు పూర్తయ్యాయి. 2022లో ఇంకా కొత్తగా ఇంకే ఎన్నికలూ లేవు. మరో 20 రోజులలో మొదలవబోయే 2023 సంవత్సరంలో కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయించడానికి అవకాశం ఉంది.

2023 ఫిబ్రవరిలో త్రిపురలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ.. త్రిపురలో బీఆర్ఎస్ పోటీ చేయడానికి ఏమాత్రం అవకాశాలు లేవు. అదే నెలలో మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలోనూ ఎన్నికలు జరగొచ్చు. ఆ రెండు ఈశాన్య రాష్ట్రాలూ బీఆర్ఎస్ పోటీ చేయడానికి అనుకూలమైనవి కావు.

2023 మే నెలలో కర్ణాటక ఎన్నికలు…

ఇక ఆ తరువాత 2023 మే నెలలో తెలంగాణకు పొరుగునే ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బరిలో దిగనుందని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణతో సరిహద్దు ఉన్న బీదర్, కలబుర్గి(గుల్బర్గా), యాదగిర్, రాయచూర్ జిల్లాలలో టీఆర్ఎస్ పోటీ చేసే సూచనలున్నాయి. వాటి పొరుగునే ఉన్న బాగల్‌కోట్, విజయపుర, బెలగావి జిల్లాలలోనూ తెలంగాణ ప్రజలు కొందరున్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాలపైనా కేసీఆర్ దృష్టి ఉంది. 

కొన్నాళ్లుగా జేడీఎస్ పార్టీతో కేసీఆర్ మంచి సంబంధాలు నెరపుతున్న నేపథ్యంలో ఆ పార్టీతో కూటమి కట్టి కర్ణాటకలో పోటీ చేస్తారు. జేడీఎస్‌ పై ఆధారపడుతూ ఆ పార్టీ మద్దతుతో ఈ ఏడు జిల్లాల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే… బెంగళూరు, చుట్టుపక్కల ఏదైనా ఒక ఎంపీ స్థానంలో కూడా టీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుకుంటోంది. జేడీఎస్ మద్దతుతో కనీసం ఒక ఎంపీ స్థానం.. కొన్ని అసెంబ్లీ స్థానాలు గెలవాలని టీఆర్ఎస్ కోరుకుంటోంది. అవపరమైతే హైదరాబాద్‌, మెదక్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి జేడీఎస్ అభ్యర్థులను తమ మద్దతులో బరిలో దించేందుకూ కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లో పోటీ చేస్తారా?

కర్ణాటక ఎన్నికల తరువాత 2023 నవంబరులో ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు రానున్నాయి. ఈ రెండింట్లో ఛత్తీస్‌గఢ్ తెలంగాణకు పొరుగు రాష్ట్రం కావడంతో అక్కడా బీఆర్ఎస్ పోటీ చేయొచ్చనే ఊహాగానాలున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 90 సీట్లున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో ఇప్పుడు అత్యధిక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉండగా బీజేపీ రెండో స్థానంలో ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు… అజిత్ జోగి నేతృత్వంలోని ‘జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్’ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కువగా గిరిజన ప్రాంతాలు కావడం.. 93 శాతం హిందూ జనాభా ఉండడం… అర్బన్ ఏరియా చాలా తక్కువగా ఉండడం.. ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణ ప్రజలు తక్కువగా ఉండడం… ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు తరలివచ్చిన గిరిజనుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన సందర్భాలుండడం వంటి కారణాల వల్ల కేసీఆర్ ఆ రాష్ట్రం వైపు చూడాలనుకోవడం లేదు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలు ఉంటూ జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ పార్టీ పెద్దగా బలంగా లేకపోవడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొనే యోచనలోనూ కేసీఆర్ లేరని తెలుస్తోంది. నవంబరు తరువాత డిసెంబరులో తెలంగాణ, రాజస్థాన్‌లలో ఎన్నికలున్నాయి. 

5 రాష్ట్రాలలో పోటీకి ప్రణాళికలు

ఆ తరువాత 2024లో ఏకంగా పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో అప్పుడు ఏకంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌లలో పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ సహా 5 రాష్ట్రాలలో పోటీకి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు.