అయ్యో! సాయిరెడ్డికి ఎందుకిలా జరిగింది?

తెలుగు రాష్ట్రాలలో కేంద్రంలోని పెద్దల దగ్గర ఎంతోకొంత యాక్సెస్, లైజనింగ్ ఉన్న పొలిటీసియన్లలో విజయసాయిరెడ్డి ఒకరు. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా ఎక్కడో ఒక చోట ప్రధాని మోదీ ఆయన్ను పలకరించడం… ఆ ఫొటోలు షేర్ చేసి తన పలుకుబడిని ఆయన ప్రచారం చేసుకుంటుండడం జరుగుతున్నదే. అంతేకాదు.. ఏదో ఒక కమిటీలో కేంద్రం ఆయన్ను నియమిస్తుండడం వంటివి జరుగుతుండడంతో విజయసాయిరెడ్డికి కేంద్రంలో కాస్త ప్రయారిటీ ఉందని ఒప్పుకోకతప్పదు. అయితే… తాజాగా జరిగిన డెవలప్మెంట్ మాత్రం విజయసాయిరెడ్డి సీను కాలిందా అనే అనుమానాలకు తావిస్తోంది. కాకతాళీయమోర, కావాలని జరిగిందో తెలియదు కానీ ఆయనకు మంచి చాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు.

రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌లో ఆయనకు చోటిస్తున్నట్లు ప్రకటించి 24 గంటల్లోనే తూచ్ అనేశారు. అవును.. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్‌కు విజయసాయిరెడ్డిని ఎంపిక చేసినట్లు మంగళవారం ప్రకటించినా బుధవారం సమావేశాలు ప్రారంభయ్యేసరికి ఆయన పేరు తొలగించారు.

వైస్‌ చైర్మన్‌ ప్యానెల్‌ నుంచి విజయసాయిని తప్పిస్తూ రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కూడ్‌ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తొలుత రాజ్యసభ వైస్ చైర్మన్ మొత్తం 8 మంది సభ్యులతో ప్యానెల్ ను ప్రకటించారు. అయితే బుధవారం రాజ్యసభలో ప్యానల్ సభ్యుల జాబితాను వెల్లడించే క్రమంలో మార్పులు కనిపించాయి.

రాజ్యసభ ప్యానెల్ ఛైర్మన్ నియామకాల్లో మార్పులు చేర్పులు చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్. ఈ మేరకు బుధవారం నూతన ప్యానెల్ వైస్ ఛైర్మన జాబితాను ప్రకటించారు. ముందు రోజు అనకున్న జాబితా నుంచి వందనా చౌహాన్, విజయసాయిరెడ్డి, ఇందుబాల గోస్వామి పేర్లను తొలగించారు. వారి స్థానంలో ప్యానెల్ వైస్ ఛైర్మన్ జాబితాలోకి సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నాగర్ పేర్లు చేర్చారు రాజ్యసభ ఛైర్మన్. సాయిరెడ్డితో పాటు మరో ఇద్దరు స్థానం కోల్పోగా కొత్తగా ఇద్దరినే చేర్చారు. దీంతో ప్యానల్‌లో ఏడుగురికే చోటిచ్చినట్లయింది.

ప్యానల్‌లో మార్పులు ఎందుకు చేశారు.. కారణలేమిటనేది ఉపరాష్ట్రపతి జగదీప్ వెల్లడించలేదు. ఇక వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో డాక్టర్ ఎల్ హనుమంతయ్య, భుభనేశ్వర్ కలిటా, సురేంద్ర సింగ్ నాగర్, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రే, డాక్టర్ శస్మిత్ పాత్రా, సరోజ్ పాండేలు ఉన్నారు.