ఔను.. నిజంగా ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి!

కేవలం రెండు రోజుల్లో ఏపీ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోవ‌డ‌మే. ఒక‌టి మాద‌క‌ద్ర‌వ్యాల ర‌వాణా, వినియోగం వంటివాటిలో ఏపీ నెంబ‌ర్‌1 స్థానంలో ఉంద‌ని కేంద్ర‌మే రెండు రోజ‌లు కింద‌ట వెల్ల‌డించింది. దీంతో ఆ విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌లోనే కేంద్రం మ‌రో బాంబు పేల్చింది. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న‌, న‌మోదైన నేత‌ల జాబితాలోనూ దేశంలో ఏపీ తొలి స్థానంలో ఉండ‌డ‌మే!

గత ఐదేళ్లలో ప్రజా ప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2017-21 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 56 కేసులు నమోదు కాగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 కేసులు ఉన్నట్లు పార్లమెంటుకు తెలిపింది. లోకసభలో ఓ ఎంపి అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక్కో రాష్ట్రంలో ఆరు కేసులతో ఉత్తరప్రదేశ్‌, కేరళ నిలిచాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో 5 కేసులు చొప్పున నమోదు కాగా, తమిళనాడులో నాలుగు కేసులు కొత్తగా వచ్చినట్టు పేర్కొన్నారు.

2017 నుంచి 2022 అక్టోబరు నాటికి దేశ వ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదైనట్టు మంత్రి వెల్లడించారు. వాటిలో 22 కేసుల్లో ఛార్జిషీట్‌లు దాఖలు చేసినట్టు తెలిపారు. సీబీఐ కేసులలో 2017లో 66.90శాతం శిక్ష రేటు నమోదు కాగా…. 2018లో 68శాతం, 2019లో 69.19 శాతం, 2020లో 69.83శాతం, 2021లో 67.56శాతంగా ఉన్నట్టు డీఓపీటీ వెల్లడించింది. దీంతో ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి అని ప్ర‌జ‌లుత‌ల బాదుకుంటున్నారు. మ‌రి దీనిపై అధికార పార్టీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక‌ప్పుడు పారిశ్రామికంగా, విద్యాల‌యాల ప‌రంగా అనేక రికార్డులు సృష్టించి తొలి స్థానంలో ఉన్న ఏపీ.. ఇప్పుడు ఇలా మ‌స‌క బార‌డంపై స‌ర్వ‌త్రా ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.