మాగుంట కొత్త తంటా

కవిత తర్వాత మాగుంటేనన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ వర్గాల్లోనూ అదే భయం నెలకొంది. ఆయనకు తొందరలో నోటీసులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కవిత నుంచి ఈనెల 11న వివరణ తీసుకున్న తర్వాత దాని ఆధారంగా లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్లు, సాక్ష్యాలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సీనియర్ లీడర్. ఆయన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి వారసత్వంగా 1998లో మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ కుటుంబంగా పేరు పొందిన మాగుంట.. ఒంగోలు పార్లమెంట్ నుండి మూడు సార్లు కాంగ్రెస్ ఎంపీగా, ఒకసారి వైసీపీ ఎంపీగా గెలుపొందారు. ఏ పార్టీలో ఉన్నా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని కాపాడుకుంటున్నారు. రాజకీయాలతోపాటూ మాగుంట కుటుబం గత 70 ఏళ్ల నుండి మద్యం వ్యాపారం చేస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీలో మాగుంట ఆగ్రోస్ పేరుతో ఆయన కుటుంబ సభ్యులు మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు.

 ఢిల్లీ మద్యం వ్యాపారంలో భారీ స్కామ్ జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించడం.. వెనువెంటనే సీబీఐ, ఈడీ దర్యాప్తు మొదలు పెట్టడంతో మాగుంట పేరు బయటకొచ్చింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో రెండు జోన్లు దక్కించుకుని మాగుంట కుటుంబ సభ్యులు లిక్కర్‌ వ్యాపారం చేశారు. అయితే.. మద్యం వ్యాపారంలో భాగంగా అమిత్ అరోరాకి ఎమ్మెల్సీ కవిత, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిసి 100 కోట్లు ముడుపులు చెల్లించినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. దీంతో.. వైసీపీ ఎంపీ మాగుంట వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌ అయింది.

 లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ విచారించింది. రాఘవరెడ్డిని విచారించిన తర్వాత అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం తీవ్ర చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి కొడుకుని వారసుడిగా ప్రకటించాలని మాగుంట ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తండ్రీకొడుకులు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో చిక్కుకోవడం వైసీపీతోపాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇంత జరుగుతున్నా స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాగుంట అంటున్నారు. అయితే ధైర్యమంతా పైపైనే అని… లోలోన భయపడుతున్నారని సన్నిహితవర్గాల సమాచారం. అరెస్టుల పర్వం కొనసాగితే మాగుంట కుటుంబ వంతు కూడా రావచ్చని భయపడుతున్నారు. ఏదైనా ఈడీ, సీబీఐ దయ అని సరిపెట్టుకుంటున్నారు….