ప్లీజ్… నన్నెవరైనా పార్టీలో చేర్చుకోండి

ఎలక్షన్ల ముందు ఏ పార్టీ గాలి వీస్తోందో కరెక్టుగా గెస్ చేసి ఆ పార్టీలోకి జంప్ చేసే గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో మాత్రం టీడీపీలో కంటిన్యూ అయి విపక్షంలో కూర్చున్నారు.

ఫర్లేదులో ఎలక్షన్ల తరువాతైనా పార్టీ మారి అధికారిపక్షంలో చేరి మంత్రి పదవి కొట్టేయాలనుకున్నా ఆ హామీ దొరక్కపోవడంతో ఫిరాయింపు ప్లాన్ కాస్త పక్కనపెట్టేశారు.

ఒకరకంగా చెప్పాలంటే పార్టీలు మారి పవర్ చేతిలో ఉంచుకునే గంటా ఎత్తుగడలకు వైసీపీ చెక్ పెట్టిందనే చెప్పాలి. గతంలో ఓసారి, తాజాగా మరోసారి వైసీపీలో చేరాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించక ఇప్పుడు జనసేనతోనూ టచ్‌లోకి వెళ్లారట. అదే సమయంలో బీజేపీతోనూ మంతనాలు చేస్తున్నారని వినిపిస్తోంది.

మరోవైపు టీడీపీతో మాత్రం ఆయన ఏమాత్రం టచ్‌లో లేకపోయినా ఆ పార్టీ ఆయన్ను పక్కన పెట్టే ధైర్యం చేయలేకపోతోంది. కారణం… గంటాకు చాలామంది కాపు నేతలతో మంచి సంబంధాలుండడం… అనేక నియోజకవర్గాలలో ఆయన తెర వెనుక రాజకీయాలు చేయగలిగే స్థాయిలో ఉండడం.. అన్నిటికీ మించి టీడీపీకి ఆర్థిక దన్నుగా ఉండే మాజీ మంత్రి పి.నారాయణకు వియ్యంకుడు కావడం.

రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న గంటా శ్రీనివాసరావు మొదట టీడీపీ నుంచే ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరి గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైనప్పుడు మంత్రయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి మంత్రయ్యారు. 2019లోనూ టీడీపీ నుంచి గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో విపక్షంలో కూర్చున్నారు. వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపినా మంత్రి పదవి హామీ దొరకలేదు. దాంతో రాజీనామా చేసి వెళ్లాలనే యోచనతో విశాఖ స్టీలు ప్లాంటును కారణంగా చూపి రాజీనామా చేశారు. కానీ, దాన్ని స్పీకరు ఆమోదించకపోవడంతో గంటా ఇంకా టీడీపీలో ఉన్నట్లే.

పైగా 2019లో టీడీపీ నుంచి గెలిచిన అందరికీ టికెట్లు గ్యారంటీ అని చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీలో ఆయన బెర్తు ఉన్నట్లే. దీంతో టెక్నికల్‌గా ఆ పార్టీలో ఉంటూనే మిగతా పార్టీలతో ఆయన బేరాలాడుతున్నారు. చివరికి ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో తేలుతారో వేచి చూడాల్సిందే.