చంద్ర‌బాబు ఎఫెక్ట్: జేసీలే తేల్చుకోవాలా?

వ‌చ్చే 2024 ఎన్నిక‌లు లేదా.. అంత‌కు ముందే వ‌చ్చే అవ‌కాశం ఉన్న ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. దీనికి రెండు కీల‌క కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి తాను స్వ‌యంగా అసెంబ్లీలో చేసిన ప్ర‌తిజ్ఞ‌. కౌర‌వ స‌భ‌లో నేను ఉండ‌ను. గౌర‌వ స‌భ ఏర్ప‌డిన త‌ర్వాత ముఖ్య‌మంత్రిగానే ఈ స‌భ‌లో అడుగు పెడ‌తాను! అని గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో త‌న కుటుంబాన్ని తూల‌నాడిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన ప్ర‌తిజ్ఞ ఇది. దీని ప్ర‌కారం అయినా.. ఆయ‌న పార్టీని గెలిపించుకుని స‌భ‌లో అడుగు పెట్టాల్సి ఉంది.

రెండు తానెంతో ముద్దుగా డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌య‌త్నించి, అమ‌రావ‌తి స‌హా అనేక ప్రాజెక్టుల‌ను కీల‌క ప్రారంభించిన నేప‌థ్యంలో వాటిని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నాశ‌నం చేస్తోంద‌ని, త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు లేక‌పోగా, రాష్ట్రం కూడా దేశంలోనే కాకుండా ప్ర‌పంచంలోనూ చిన్న‌బుచ్చుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తాను అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.

ఈ రెండు కార‌ణాల నేప‌థ్యంలో టీడీపీని ఎట్టి ప‌రిస్తితిలోనూ అదికారంలోకి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు కంక‌ణం క‌ట్టుకుని జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు కూడా చేస్తున్నారు.అయితే, ఇదేమీ అంత తేలిక‌కాదు. బ‌ల‌మైన నాయ‌కులు, అధికారం ఉన్న వైసీపీని త‌ట్టుకుని నెగ్గాలంటే.. అంతే బ‌ల‌మైన నిర్ణ‌యాలు కూడా తీసుకోవాలి. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌పై త‌న‌దైన పంథాను చంద్ర‌బాబు ఇప్ప‌టికే పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని, త్యాగాల‌కు సిద్ధం కావాలని ఆయ‌న వారికి సూచిస్తున్నారు.

త్యాగాలు అంటే.. చాలా మంది నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఇలాంటివాటిని త్య‌జించాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌లు బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో బ‌ల‌మైన నాయ‌కుల‌కే తాను టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం ఎంపీ, తాడిప‌త్రి అసెంబ్లీ స్థానాల విష‌యంలోనూ చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ రెండు స్థానాల్లోనూ 2014 ఎన్నిక‌ల్లో జేసీ దివాక‌ర్‌రెడ్డి ఎంపీగా, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఇద్ద‌రు నాయ‌కులు త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోర‌డంతో చంద్ర‌బాబు ఇచ్చారు. అయితే, ఇద్ద‌రు కూడా ఓడిపోయారు. పోనీ.. ఇద్ద‌రు ఇప్పుడు పుంజుకున్నారా? అంటే.. కేవ‌లం జేసీ బ్ర‌ద‌ర్స్ హ‌వా మాత్ర‌మే ఇప్ప‌టికీ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు వార‌సుల‌ను కూడా ప‌క్క‌న పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్‌లు మాత్ర‌మే పోటీకి దిగాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ఎలాంటి మార్పులేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో ఇప్పుడు జేసీలు ఏం చేస్తార‌నే ఆస‌క్తిగా మారింది.