బాబు దూకుడు.. మోడీ మెచ్చిన సంగ‌తి..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడును సాక్షాత్తూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కొనియాడ‌డం ఆసక్తిగా మారింది. అంతేకాదు.. టీడీపీలోనూ ఉత్సాహాన్ని పెంచింద‌నే చెప్పాలి. తాజాగా జీ20 స‌ద‌స్సుకు సంబంధించి ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన అఖిల ప‌క్ష స‌మావేశంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు. ఇది.. ఈ స‌మావేశానికి పాల్గొన్న వారిని మంత్ర ముగ్ధుల‌ను చేసింద‌నే చెప్పాలి.

చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాబోయే పాతికేళ్ల‌కు సంబంధించి ఒక స‌మ‌గ్ర విజ‌న్ రూపొందించుకోవాల‌ని సూచించారు. అంతేకాదు.. యువ శ‌క్తిని వినియోగించుకుని దేశం పురోభివృద్ధిలో ముందుకు న‌డవాల‌ని కూడా కోరుకున్నారు. ఇక‌, సాంకేతిక ప‌రంగా కూడా దూకుడు చూపించాల‌ని అన్నారు. డిజిట‌ల్ యుగంలో మ‌రింత పురోభివృద్ధి సాధించేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

ఈ విష‌యాలు నిజంగా స‌మావేశానికి వ‌చ్చిన వారు ఎవ‌రూ కూడా ప్ర‌స్తావించ‌లేద‌నే చెప్పాలి. దీంతో అంద‌రి దృష్టీ మాజీ సీఎం చంద్ర‌బాబుపైనే ప‌డింది. ఈ విష‌యంపై ముగ్ధులైన ప్ర‌ధాని.. త‌ర్వాత త‌న ఉప‌న్యాసంలోనూ.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ దిశ‌గా కార్యాచ‌ర‌ణ‌కు అంద‌రూ పూనుకోవాల‌ని పిలుపునిచ్చారు. త‌ర్వాత వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు తో మాట్లాడిన స‌మ‌యంలోనూ ప్ర‌ధాని ఇదే విష‌యం చెప్పారు.

ఈ ప‌రిణామాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ అధికార పార్టీ వైసీపీ ఏదైతే చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేస్తోందో అవ‌న్నీ తుడిచి పెట్టుకుపోయాయ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. చంద్ర‌బాబు విజ‌న్‌కు సాటి రారెవ్వ‌రూ అని వ్యాఖ్యానించారు. ఆయన విజ‌న్ స‌జీవ‌మ‌ని.. చంద్ర‌బాబుకు కేవ‌లం రాజ‌కీయాలే ముఖ్యం కాద‌ని, రాష్ట్ర‌, దేశ‌భ‌విష్య‌త్తులు అత్యంత ప్ర‌ధాన‌మ‌నే విష‌యం మ‌రో సారి స్ప‌ష్ట‌మైంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.