చంద్రబాబు బిగ్ స్టెప్… టీడీపీ ఎంపీలతో రాజీనామాలు?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. ఒకరి వైఫల్యాలను మరొకరు ఫుల్లుగా ఓట్లుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే టీడీపీ అధినేత బిగ్ స్టెప్ వేస్తున్నట్లు సమాచారం. డిసెంబరు 7 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ల్యాండయిన చంద్రబాబు రానున్న సమావేశాలను రాజకీయంగా వాడుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 2019లో గెలిచినప్పటి నుంచి తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైసీపీని… తనను, జనసేనను కలవకుండా ప్రయత్నిస్తున్న బీజేపీని ఒకేసారి ప్రజల ముందు దోషిగా నిలిపే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నట్లు సమాచారం.

వైసీపీ చేతగానితనాన్ని, బీజేపీ దగాకోరుతనాన్ని రెండింటినీ ఒకేసారి ప్రజల ముందు పెట్టేలా టీడీపీ అధినేత తన ఎంపీలతో రాజీనామా చేయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్ సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉండగా రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే ఉన్నారు. ఈ నలుగురితోనూ ప్రస్తుత సమావేశాల సమయంలో రాజీనామా చేయించనున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలు కోసం చంద్రబాబు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు ఎంపీలు కూడా సంసిద్ధత వ్యక్తంచేసినట్లు సమాచారం. అయితే… పార్లమెంటు సమావేశాల ప్రారంభంలోనూ రాజీనామాలు చేస్తారా… లేదంటే సమావేశాలు ముగిసే దశలో రాజీనామా చేస్తారా అనేది ఇంకా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తూ, దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పార్లమెంటులో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని.. అమరావతి ఇష్యూ కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని టీడీపీ బలంగా అనుకుంటోంది. సో… ఇదంతా సక్సెస్‌ఫుల్‌గా చేసిన తరువాత రాజీనామా చేయాలనే యోచన కూడా ఉంది.

అంతేకాకుండా… కేంద్రం పిలుపు మేరకు జీ20 సన్నాహక సమావేశాలకు చంద్రబాబు హాజరవుతుండడంతో ఢిల్లీలో నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో ఎలా వ్యవహరిస్తారు.. ఒక వేళ భేటీలు ఉంటాయా.. వచ్చే ఎన్నికల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటనే అంచనాల ఆధారంగా ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.