చంద్రబాబును మార్చిన జగన్ కు థ్యాంక్స్ చెబుతున్న తమ్ముళ్లు

తిరుగులేని ఆడ్మినిస్ట్రేటర్ గా పేరుంది చంద్రబాబుకు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీఈవోగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చూపించిన చంద్రబాబు.. అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించారనే చెప్పాలి. పాలనలో భాగంగా ప్రజల మనసుల్ని దోచే అంశం మీదనే ఫోకస్ పెట్టాలే తప్పించి.. మిగిలిన అంశాలు పెద్దగా పని చేయవన్న విషయం ఆయన చేతికి అధికారం చేజారిన తర్వాత కానీ అర్థం కాలేదు. పాలనలో చంద్రబాబు శైలిని మెచ్చుకునే వారంతా ఆయన ప్రసంగాలకు మాత్రం తెగ బోరింగ్ గా ఫీల్ అవుతారు.

అయితే.. ఆయన ప్రసంగాల్లో పదును తెచ్చిన ఘనత మొదట దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే.. అప్పటివరకు చంద్రబాబుకు ప్రసంగాలతో అవసరం లేకుండా పోయింది. ఆయనేం చెబితే అదే అన్నట్లు ఉండేది. దీనికి తోడు అధికారం ఆయన చేతిలోనే ఉండటంతో ఆయనకు తిరుగు ఉండేది కాదు. అలాంటి చంద్రబాబుకు తన మాటలతో ప్రజల్ని ఆకర్షించేలా చేయాల్సిన అవసరాన్ని తీసుకొచ్చిన మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రడ్డి.

ప్రతిపక్ష నేతగా మొదటి ఐదేళ్లు చంద్రబాబు పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. చేతిలో పవర్ లేకపోవటం.. మరో వైపు ముఖ్యమంత్రిగా వైఎస్ లాంటి ఛరిష్మా ఉన్న అధినేతను అధిగమిస్తూ మాట్లాడటం కష్టంగా ఉండేది. అయితే.. తన ప్రసంగ తీరును మార్చుకునేందుకు తీవ్రంగా శ్రమించిన చంద్రబాబు.. ఐదేళ్లకు కాస్తంత మెరుగుపడిన పరిస్థితి. అయినా కూడా వైఎస్ చేసే సూటి ప్రసంగాల ముందు చంద్రబాబు తేలిపోయేవారు. అయితే.. అదే పనిగా ఎదురుదెబ్బల కారణంగా చంద్రబాబు మాటల్లో తేడా మొదలైంది.

అలా మొదలైన మార్పు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా చాలా మెరుగుపడింది. ఇవాల్టి రోజున చంద్రబాబు ప్రసంగం వింటే.. వింటున్నది చంద్రబాబు మాటలేనా? అనుకునే పరిస్థితి. అంతలా ఆయన మాటల్లో మార్పు వచ్చింది. మాటల కోసం కిందా మీదా పడి.. అందరి చేత జోకులు వేయించుకునే స్థితి నుంచి తన మాటలతో నిప్పులు కురిపించే స్థాయికి చంద్రబాబు చేరుకున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

చంద్రబాబు ప్రసంగంలో హైలెట్ అన్నట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యల్ని చూస్తే..

  • ‘పోలీసులను అడ్డు పెట్టుకుని బెదిరించడం, పరదాల మాటున దాక్కుని తిరగడం జగన్‌కు అలవాటైంది. నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడు రఘురామకృష్ణంరాజును పోలీసులతో చితకబాది పైశాచిక ఆనందం పొందారు. ఎవరైనా మనుషులు చనిపోయారంటే సైకో నవ్వులు నవ్వుతుంటావు. దీనిని బట్టి చెప్పేయొచ్చు ఈ జగన్‌ మనస్తత్వం ఏమిటో’
  • అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు మనకు జగనే శని. ఐదేళ్లు ఈ శనిని వదిలించుకోవాలి.
  • మద్య నిషేధం అన్నాడు. ముద్దులు పెట్టాడు. ఒక్క చాన్స్ అంటే మోసపోయి ఓటు వేసినందుకు పిడిగుద్దలు గుద్దుతున్నాడు. దీంతో ప్రజలు ఇదేం ఖర్మరా అని బాధ పడుతున్నారు.
  • పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసిన నాకు డ్యాం వద్దకు వెళ్లే అర్హత లేదా? రాష్ట్రంలో చీకటి.. ఆరాచక పాలన జరుగుతోంది. చేసిన తప్పులు బయటపడకూడదనే ప్రతిపక్షాల్ని రానివ్వట్లేదు.
  • కొల్లేరు పైన ఎవరికైనా అధికారం ఉందంటే అది వడ్డీ సామాజికవర్గానికే ఉంది. ఆ హక్కులను కాలరాస్తూ ఊరు ఊరంతా వైసీపీకి ఓటు వేస్తామంటేనే చేపలు పట్టుకోనిస్తున్నారు. నేను అదే పనిచేసుంటే నువ్వు అసలు ఏమైపోయేవాడివో తెలుసుకో.
  • టీటీడీలో 37 మంది సభ్యులకు గాను 50 శాతం రిజర్వేషన్‌ ఉంటే కేవలం ముగ్గురికి ఇచ్చి చేతులు దులుపుకున్నావు. 12కి గాను 10 యూనివర్శిటీలను మీ సామాజిక వర్గానికే కట్టబెట్టావు.