బాణం ఎవరు వదిలినా.. గుచ్చుకునేది మాత్రం అక్కడే ?

వైఎస్ షర్మి పాదయాత్ర, అరెస్ట్ ఎపిసోడ్ల తర్వాత చాలామంది నాయకులు షర్మిల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, జీజెపీ నాయకులు షర్మిళకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ పోలీసు తీరుపై విరుచుకుపడ్డారు. ఐతే.. ఎక్కడ షర్మిళను అరెస్ట్ చేశారో అక్కడినుంచే మళ్లీ పాదయాత్ర కొనసాగించబోతు న్నారు. ఈ అరెస్ట్ ఎపిసోడ్ తో షర్మిళ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయింది. దివంగత నేత వైఎస్ ఆర్ కుటుంబం మొత్తం తెలంగాణకు వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక షర్మిళ ఎవరు వదిలి బాణం..? అనే విషయంపై అన్ని పార్టీల నేతలు చాలాకాలంగా రకరకాలు వాదనలు వినిపిస్తున్నారు.

షర్మిళపై వస్తున్న విమర్శలను పక్కనపెడితే.. అసలు షర్మిళ బలం ఎంత..? తెలంగాణలో ఏఏ ప్రాంతాల్లో ఆమె పార్టీ ప్రభావం చూపుతుంది అనేదే అసలు ప్రశ్న. అలా ఆలోచిస్తే ముందుగా గుర్తొచ్చేది ఖమ్మం జిల్లా. 2021 జులై 8న వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని ఖమ్మం నుంచే ఎనౌన్స్ చేశారు షర్మిళ. ఎందుకంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువ. రాష్ట్ర విభజన తర్వత కూడా ఖమ్మం జిల్లా ఓటర్లు వైఎస్ఆర్ వైపే ఉన్నారు. 2014లో ఖమ్మం పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ఎంపీ సీటుతో పాటు 3 అసెంబ్లీ సీట్లను కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జగన్ తెలంగాణను వదిలేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించారు.

ప్రస్తుతం ఖమ్మం రాజకీయ ముఖచిత్రం చిన్నాభిన్నంగానే ఉంది. కాంగ్రెస్, టీడీపీ, వైస్ఆర్ సీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా నేతల్లో అసంతృప్తి వాదులే ఎక్కువగా ఉన్నారు. వారంతా షర్మిళ పార్టీ వైపు చూస్తున్నారని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు.

కమ్యూనిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉండే ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ అనేక అభివృద్ధి పనులు చేశారు. పెండింగ్ లో ఉన్న ఫారెస్ట్ వివాద భూముల్ని పరిష్కరించి గిరిజనులకు పోడు పట్టాలు అందించారు. ఏజెన్సీ ఏరియాల్లోని గిరిజనేతరులకు కూడా నివాస సౌకర్యం కల్పించారు. సాగునీటి పథకాలు ప్రవేశపెట్టి రైతుల్ని ఆదుకున్నారు. దుమ్ముగూడెం సీతారమ సాగునీటి ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ ముద్ర చెరిగిపోనిది. అదే షర్మిళకు కొండంత బలం కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే పాలేరు నుంచి షర్మిళ బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ఐతే షర్మిళ వల్ల ఏ పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడే తెల్చి చెప్పలేం.