కేసుల్లేవు.. గొడవల్లేవు.. పాపం కాంగ్రెస్

ఎనిమిదేళ్ల కిందట ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. అంకతుముందు పదేళ్ల నుంచి ఆ పార్టీ అధికారంలోనే ఉంది. కానీ కొన్ని నెలల్లో ఆ పార్టీ ముఖచిత్రం మారిపోయింది. ఎంతో రిస్క్ చేసి ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అందుకు ప్రతిఫలంగా తెలంగాణలో కేవలం 21 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయింది.

తెలంగాణలో తర్వాత అయినా పుంజుకుని అధికారంలోకి వస్తుందనుకుంటే.. ఇంకో ఐదేళ్లు సీట్లు ఇంకా తగ్గిపోయాయి. ఇక 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి తలుచుకుంటే దయనీంగా అనిపిస్తోంది. ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్ష హోదాను ఆ పార్టీ కోల్పోయింది. తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ను జనాలు చూడడం మానేసి చాలా రోజులైంది. ఇప్పుడు ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే వార్ నడుస్తోంది. మీడియా దృష్టంతా కూడా ఆ పార్టీల మీదే ఉంటోంది.

ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అని పోటీ పడితే.. కాంగ్రెస్ ఆటలో అరటిపండులా తయారైంది. ఆ తర్వాత కేసులు, ప్రతి కేసులు, వాద ప్రతివాదాలు, గొడవలతో టీఆర్ఎస్, బీజేపీ కొట్టుకుంటున్నాయే తప్ప అసలు కాంగ్రెస్ గురించి ఎక్కడా సౌండ్ లేదు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఆయన స్థాయిలో బాగానే కష్టపడ్డా ఫలితం లేకపోయింది. అసలు మీడియా దృష్టిలో తెలంగాణలో కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉందనే విషయమే మరిచినట్లుగా అనిపిస్తోంది. చివరికి వైఎస్సార్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టిన షర్మిళకు కూడా మీడియాలో అంతో ఇంతో మైలేజీ వస్తోంది. ఈ మధ్య ఆమె పేరు బాగా వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్ ఆచూకీనే కనిపించడం లేదు.

లిక్కర్ స్కామ్, ఐటీ, ఈడీ దాడులు లాంటి అస్త్రాలతో అధికార టీఆర్ఎస్‌ను బీజేపీ ఇరుకున పెడుతుంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేస్తోంది. కొన్ని రోజుల నుంచి మీడియాలో దీని గురించే చర్చంతా. టీఆర్ఎస్, బీజేపీ వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో పెద్ద రచ్చే జరుగుతోంది. ఆ రెండు పార్టీల గురించే జనం మాట్లాడుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ ఊసు లేదు. కనీసం ఇలాంటి కేసులు, వివాదాలతో అయినా వార్తల్లో నిలుద్దామంటే తమకు అలాంటి ఛాన్స్ దక్కట్లేదు. కనీసం షర్మిళ లాగా ఏదో ఒక రచ్చ చేసి అయినా మీడియా దృష్టిలో పడకుంటే 2024 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీని అందరూ మరిచిపోవడం ఖాయం.