50 ఏళ్ల‌ ‘అన్న‌దాత’ ఆగిపోయింది!

తెలుగు మీడియా రంగంలో మ‌రో సంచ‌ల‌నం. తెలుగు మీడియా మొఘ‌ల్ రామోజీరావు గ్రూపు నుంచీ మ‌రో ప‌త్రిక మూత‌ప‌డింది. దాదాపు 50 ఏళ్ల‌కుపైగా సుదీర్ఘ కాలం తెలుగు నేల‌పై రైతుల‌కు విశిష్ట‌మైన స‌మాచార సేవ‌లు అందిస్తూ వ‌స్తున్న మాస‌ప‌త్రిక అన్న‌దాత మూత‌ప‌డింది. అన్న‌దాత ప‌త్రిక‌ను మూసివేస్తున్న‌ట్లు ఆ ప‌త్రిక సంపాద‌కుడు అమిర్నేని హ‌రికృష్ణ పేరుతో విడుద‌లైన ప్ర‌క‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. మీడియా ఈ నిర్ణ‌యం ఒక షాక్‌లా మారింది. ల‌క్ష కాపీల స‌ర్కులేష‌న్ చేరుకున్న మాస‌ప‌త్రిక‌గా గుర్తింపు పొందిన ఈ ప‌త్రికంటే అభిమానించ‌ని రైత‌న్న ఉండ‌రు. వ్య‌వ‌సాయానికి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు వినూత్న‌మైన స‌మాచారాన్ని, స‌ల‌హాలు, సూచ‌న‌లు పాఠ‌క‌లోకానికి అందిస్తూ, వ్య‌వ‌సాయంలో వ‌స్తున్న ఆధునిక ప‌ద్ద‌తులు, సాంకేతిక ప‌రిణామాల‌ను, వ్య‌వ‌సాయ నిపుణుల విలువైన స‌ల‌హాలు సూచ‌న‌ల‌తో రైత‌న్న‌ల‌కు వెన్నుద‌న్నుగా నిలిచి సేవ‌లందిచి అందరి అభిమానం చూర‌గొప్ప ప‌త్రిక‌ల్లో అన్న‌దాత ప‌త్రిక‌ది ఒక ప్ర‌త్యేక స్థానముంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని టీవీ ఛానెళ్ల‌లో వ‌చ్చే వ్య‌వ‌సాయ కార్య‌క్ర‌మాల‌కు స్ఫూర్తి ప్ర‌దాత అన్న‌దాత విజ‌య‌మే అని చెప్పాలి. అలాంటి ప‌త్రికను రామోజీరావు మూసివేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం అంద‌ర్నీ నిర్ఘాంత‌పోయేలా చేసింది.

మారుతున్న టెక్నాల‌జీ ఈ ప‌త్రిక మూత‌కు ఒక కార‌ణ‌మ‌ని సంపాద‌కుడు త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అన్న‌దాత అనే టీవీ కార‌క్ర‌మ రూపంలో రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తాము తెలియజేస్తున్నామని, ఇక మాస పత్రిక అవసరం తగ్గినట్లు భావిస్తున్నామని అందుకే మూసివేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరిపోతున్నందువలన మాస పత్రికల ప్రాధాన్యం తగ్గినట్లుగా ఈ ప్ర‌క‌ట‌న‌లో విశ్లేషించారు.

ఈనాడు గ్రూపు సంస్థ‌లో ఈనాడు ప‌త్రిక‌తో పాటు వాటి అనుబంధ ప‌త్రిక‌లు ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. సితార‌, చ‌తుర‌, విపుల‌, తెలుగు వెలుగు, బాల‌బార‌తం, అన్న‌దాత లాంటివి తెలుగు పాఠ‌క‌లోకానికి ఎంతో చేరువ‌య్యాయి. అంత విజ‌య‌వంతంగా న‌డుస్తున్న ఈ ప‌త్రిక‌ల‌ను రామోజీరావు ఒక్కొక్క‌టిగా మూత వేస్తూ వ‌స్తున్నారు. చతుర‌, విపుల ప‌త్రిక‌ల‌ను మూసివేశారు. త‌రువాత తెలుగు వెలుగు, బాల‌బార‌తం ప‌త్రిక‌ల‌ను మూసివేశారు. అయితే ల‌క్ష కాపీల స‌ర్క్యలేష‌న్ ఉన్న అన్న‌దాత‌ను ఆయ‌న మూసివేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ అన్న‌దాత ప‌త్రిక‌ను కూడా ఆయ‌న ఆపేస్తూ తీసుకున్న నిర్ణ‌యం అంద‌ర్నీ విస్తుపోయేలా చేసింది.

మీడియా రంగంలో వ్యాపార రంగంలో రామోజీరావుది అందెవేసిన చేయి. వ్యాపారాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డానికి ఆయ‌న చాలా క‌ఠిన మైన నిర్ణ‌యాలు, క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తుంటారు. లాభాలు సాధించ‌ని వ్యాపారాల‌ను మూసివేయ‌డానికి ఆయ‌న ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌రు. ఇన్నాళ్లు రామోజీ గ్రూపుకు లాభ‌సాటి ప‌త్రిక‌గానే ఉన్న అన్న‌దాత మూసివేతకు దారితీసిన ప‌రిస్థితులు ఏమై ఉంటాయ‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. ఈ ప‌త్రిక మూసివేత‌కు దారి తీసిన ప‌రిస్థితుల గురించి రామోజీరావు గానీ ఆయ‌న కుటుంబ స‌భ్యులెవ‌రూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌కున్న‌ప్ప‌టికీ ఈ ప‌త్రిక న‌ష్టాల్లో కూరుకుపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ప‌లు ర‌కాలుగా విశ్వేషిస్తున్నారు.

రాష్ట్రంలో వై.ఎస్‌.జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక అన్న‌దాత స‌ర్క్యులేష‌న్ మీద ప్ర‌భావం బాగా ప‌డింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్న‌దాత విజ‌యం వెనుక అస‌లు కార‌ణం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైతు సంఘాలే. రైతు సంఘాల‌కు, ఇత‌ర‌త్రా రైతు అనుబంధ వ్య‌వ‌స్థ‌ల‌కు ఈనాడు అనుకూల ప్ర‌భుత్వాలు ఈ ప‌త్రిక‌ను ప్ర‌భుత్వ‌మే కొని రైతు సంఘాల‌కు స‌ర‌ఫ‌రా చేసేలా అన్నదాత‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో పాఠ‌కులు ఈ ప‌త్రిక‌ను కొన్నా కొన‌క‌పోయినా ప్ర‌భుత్వమే ఈ ప‌త్రిక‌ను కొని రైతుకు సంఘాల‌కు చేర‌వేసేది. ఆ పంపిణీ కూడా పోస్టు ద్వారా పంపేది. త‌పాలా ఖ‌ర్చులు స‌బ్సీడీ రూపేణా పొందేది. ప్ర‌భుత్వం ఓ వైపు వేల కాపీలు కొని చందాలు చెల్లిస్తుండ‌టంతో ప‌త్రిక నిర్వ‌హ‌ణ రామోజీరావుకు పెద్ద క‌ష్టంగా అనిపించ‌లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏవి వ‌చ్చినా ఈనాడు హ‌వా న‌డిచేది కాబ‌ట్టి అన్న‌దాత‌కు అంత ఇబ్బందులు ఎదురు కాలేదు.

ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆ ప‌రిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే వ్య‌వ‌సాయ శాఖ త‌ర‌ఫున సొంతంగా ఒక వ్య‌వ‌సాయ ప‌త్రిక‌ను రూపొందించి న‌డుపుతోంది. దాన్నే అన్ని రైతు సంఘాల‌కు, అనుబంధ సంఘాల‌కు పంపిణీ చేస్తోంది. దాంతో ప్ర‌భుత్వంతో అన్న‌దాత కుదుర్చుకున్న ఒప్పందం ర‌ద్దై ఒక్క‌సారిగా స‌ర్క్యులేష‌న్ ప‌డిపోయింది. పైగా కొత్త‌త‌రం వ్య‌వ‌సాయ జ‌ర్న‌లిజంతో పోటీ ప‌డ‌టం ఆ ప‌త్రిక‌కు చేత కాలేద‌నే వాద‌నా వినిపిస్తోంది. గ‌తంలో ఉన్నంత ప‌దునుగా, ఆక‌ర్ష‌ణీయంగా అన్న‌దాత‌ను తీసుకురావ‌డంలో అన్న‌దాత బృందం విఫ‌ల‌మైంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులోని ఆర్టిక‌ల్స్ కూడా కొత్త‌ద‌నమేమీ లేకుండా మూస ప‌ద్ద‌తిలో సాగిపోవ‌డంతో పాఠ‌కాస‌క్తిని కోల్పోయింది. దానికి త‌గ్గ‌ట్టు ప‌త్రిక‌కు మార్కెట్ ప‌డిపోయింది.

దాంతో ప్ర‌భుత్వం నుంచీ అన్న‌దాత‌కు పెద్ద ఎత్తున చందా బిల్లులు అందే మార్గాలు మూసుకుపోయాయి. మారిన కాల‌మాన ప‌రిస్థితులు, వేగంగా మారుతున్న టెక్నాల‌జీ యుగంలో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా ఈ ప‌త్రిక‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయానికి రామోజీ గ్రూపు వ‌చ్చింది. లాభాలు సంపాదించ‌ని ప‌త్రిక‌ను న‌ష్టాల‌తో కొన‌సాగించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని రామోజీరావు ఈ ప‌త్రిక‌ను మూసివేయాల‌నే అంతిమంగా నిర్ణ‌యించుకున్నారు. చివ‌ర‌కు ప‌త్రిక‌ను మూసివేస్తున్న‌ట్లు అన్న‌దాత సంపాద‌కుడి ద్వారా ప్ర‌క‌ట‌న ఇప్పించారు. దాంతో ద‌శాబ్దాల పాటు విజ‌య‌వంతంగా సాగిన అన్న‌దాత ప్ర‌స్థానం ముగిసిపోయిన‌ట్ల‌యింది.