జ‌గ‌న్ ఆస్తుల కేసు.. ఆ ఇద్ద‌రు అధికారులు ఇరుక్కుపోయారు!

ఏపీలో సీఎం జగన్ ఆస్తుల కేసులో ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, అరబిందో-హెటిరో ఛార్జ్షీట్లో బీపీ ఆచార్యపై సీబీఐ కోర్టు అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్థించింది. రఘురాం సిమెంట్స్ ఛార్జ్షీట్ కొట్టివేయాలన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం అభ్యర్థననూ తోసిపుచ్చింది. ప్రస్తుత దశలో సీబీఐ కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మీపై విచార‌ణ సాగాల్సిందే.. అని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్, అరబిందో-హెటిరో ఛార్జ్షీట్లో తనపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదన్న బీపీ ఆచార్య వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. లేపాక్షి, అరబిందో, హెటిరోలకు భూముల కేటాయింపులో ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం మోపింది. లేపాక్షి ఛార్జ్షీట్లో ఏడో నిందితుడిగా, అరబిందో-హెటిరో అభియోగపత్రంలో 9వ నిందితుడిగా ఆచార్యను సీబీఐ చేర్చింది. ఛార్జ్షీట్ దాఖలు సమయంలో ఆచార్యపై ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి లేకపోవడంతో.. సీబీఐ కోర్టు కేవలం ఐపీసీ అభియోగాలను పరిగణనలోకి తీసుకుంది.

ఆ తర్వాత కేంద్రం అనుమతివ్వడంతో బీపీ ఆచార్యపై గతేడాది సీబీఐ కోర్టు అవినీతి నిరోధక చట్టంలోని అభియోగాలను కూడా విచారణకు స్వీకరించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. బీపీ ఆచార్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి తాను చేసిన దరఖాస్తుపై నిర్ణయం తేలకముందే సీబీఐ కోర్టు పీసీ చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోరాదని వాదించారు. పీసీ చట్టాన్ని సవరించారని.. తనపై పెట్టిన సెక్షన్లను రద్దు చేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. సీబీఐ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది.

మ‌రో అధికారి కృపానందం..
జగన్ ఆస్తుల కేసులోని రఘురాం సిమెంట్స్ ఛార్జ్షీట్ కొట్టివేయాలని కోరుతూ విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది. రఘురాం సిమెంట్స్కు గనుల కేటాయింపు ప్రక్రియలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కృపానందం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం మోపింది. రఘురాం సిమెంట్స్కు గనులు కట్టబెట్టడం కోసం గుజరాత్ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్.. జీఏసీఎల్ రెన్యువల్ దరఖాస్తును ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని ఆరోపించింది.

కృపానందంపై అభియోగాలను సీబీఐ కోర్టు 2014లో విచారణకు స్వీకరించింది. రఘురాం సిమెంట్స్ ఛార్జ్షీట్ను, తనపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ 2014లో కృపానందం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. అభియోగాల్లో నిజానిజాలు సీబీఐ కోర్టు విచారణలోనే తేలుతాయన్న హైకోర్టు.. పిటిషన్ను కొట్టివేసింది.