మీరు చెబుతున్న‌ట్టు.. ఇవి తాటాకు చ‌ప్పుళ్లు కావేమో స‌ర్‌!

తెలంగాణ‌లో వ‌రుస దాడులు. ఒక కేసు పోతే ఇంకొక‌టి. ఒక నేత చిక్కారులే అనుకుంటే మ‌రో నేత‌. ఇలా వ‌రుస‌గా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు తెలంగాణ‌ను చుట్టేస్తున్నాయి. అడ్ర‌స్‌లు వెతుక్కుని మ‌రీ వ‌చ్చి దాడులు చేస్తున్నాయి. అయితే, ఈ దాడుల‌ను తాము ఏమాత్రం ఖాత‌రు చేసేది లేద‌ని, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ, బీజేపీ స‌ర్కారు తాటాకు చ‌ప్పుళ్ల‌కు తాము బెదిరేది కూడా లేద‌ని మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, శ్రీనివాస్ గౌడ‌లు కొంత గంభీరంగానే వ్యాఖ్యానించారు.

మంచిదే, ఏ ప్ర‌భుత్వ‌మైనా ఆ మాత్రం త‌న‌ను తాను ర‌క్షించుకోవాల్సిందే. అయితే, జ‌రుగుతున్న ప‌రిణామాలు, చేస్తున్న దాడుల‌ను చూస్తే మాత్రం “ఇవి.. తాటాకు చ‌ప్పుళ్లు, త‌లుపు చ‌ప్పుళ్లు కావేమో మిస్ట‌ర్ మినిస్ట‌ర్స్‌!!” అని నెటిజ‌న్లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇవి ఊహించ‌నవేన‌ని మంత్రులు చెబుతున్న విష‌యంపైనా నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. టీఆర్ ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులను ముందే ఊహించామని.. మంత్రులు అన్నారు. నిజంగానే ఊహించి ఉంటే, మంత్రి మ‌ల్లారెడ్డి ఇంట్లో అంత పెద్ద ఎత్తున న‌గ‌దు ఎలా దొరికింది? అనేది ప్ర‌శ్న‌.

ఇక‌, కేంద్ర సంస్థల దాడులను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు మంత్రులు. దర్యాప్తు సంస్థల ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే, ఎలా ఎదుర్కొంటారు? అనేది మాత్రం చెప్పేలేదు. ఇక‌, వ‌రుస ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం విచారణ వేళ రాష్ట్రంలో ఐటీ సోదాలు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అదేవిధంగా గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారంలో ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ తనిఖీలు నిర్వహించింది. తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. మ‌రి ఇన్ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నా.. సీఎం కేసీఆర్ మౌనంగా ఉండ‌డం మ‌రో విశేషం. ఆ దాడుల క‌న్నా కేసీఆర్ మౌన‌మే చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం మ‌రో చిత్రం!