అఖిలం కోల్పోతున్న అఖిల ప్రియ‌..!

రాజ‌కీయాల్లో ఎంత ఒదిగి ఉంటే అంత మేలు జ‌రుగుతుంది. అంతేకాదు.. పాలిటిక్స్‌లో వ్యూహాల‌కే స్థానం త‌ప్ప‌, బెదిరింపులు, భీష్మించ‌డాల‌కు తావులేదు. నాయ‌కులు ఎంతటి వారైనా.. వారికి ఎంత చ‌రిష్మా ఉన్నా ప్ర‌జ‌ల‌కు చేరువ అయితే ప‌ట్టు ద‌క్కేది. అయితే, ఈ విష‌యంలో ఎందుకో యువ నాయ‌కురాలు, మాజీ మంత్రి అఖిల ప్రియ త‌డ‌బ‌డ్డారు. కాదుకాదు.. చేజేతులా.. రాజ‌కీయాల‌ను దూరం చేసుకున్నారు.

ఒక‌ప్పుడు ఆళ్ల‌గ‌డ్డ అంటే అమ్మ‌, నంద్యాల అంటే నాన్న.. అని గ‌ర్వంగా చెప్పుకొన్న అఖిల ప్రియ‌కు ఇప్పుడు అదే గ‌ర్వం రాజ‌కీయాల‌కు భంగం తీసుకువచ్చింది. ప‌క్క‌నే ఉన్న శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గానికి చంద్ర‌బాబు అభ్య‌ర్థిని దాదాపు ఖ‌రారు చేశారు. కానీ, తాను వేడుకున్నా ఆళ్ల‌గ‌డ్డ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. అంతేకాదు.. క‌నీసం త‌ర్వాత చూద్దాం! అని కూడా ఆయ‌న చెప్ప‌లేని ప‌రిస్థితిలో అఖిల ప్రియ ఉన్నారు.

ఇక‌, కేడ‌ర్ విష‌యానికి వ‌స్తే.. 2014-19 వ‌ర‌కు త‌న వెంట తిరిగిన‌ కేడ‌ర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. జైలుకు వెళ్లిరావ‌డం, స్థానికంగా ఏవీ సుబ్బారెడ్డితో వివాదాలు, సొంత పార్టీ నేత‌ల‌నే ఛీత్క‌రించ‌డం, ఒంట‌రిగా వ్యూహాలు సిద్ధం చేసుకుని సొంత అజెండాను అమ‌లు చేయ‌డం వంటివి అఖిల ప్రియ‌ను పార్టీలో ఒంట‌రిని చేశాయి. దీంతో ఇప్పుడు ఆమెను ప‌ట్టించుకునే వారే లేకుండా పోయార‌ని అంటున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నంద్యాల నుంచి త‌న త‌మ్ముడు జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డిని బ‌రిలో దింపాల‌ని భావించిన అఖిల ప్రియ‌.. గ‌తంలో తాను ఏరికోరి టికెట్ ఇప్పించిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితోనూ అంటీ ముట్ట‌నట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అఖిల ప్రియ‌కు హ‌వా త‌గ్గిపోగా.. అస‌లు వ‌చ్చే ఎన్నికల నాటికి ఎలాంటి ప‌రిణామాలు మారుతాయోనని నాయ‌కులు అంటున్నారు.