కుటుంబ రాజకీయాల‌కు వ్య‌తిరేకం అంటూనే.. బీజేపీ నిర్వాకం ఇదీ!

బీజేపీ నాయ‌కులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవ‌ల కాలంలో కుటుంబ రాజ‌కీయాల‌ను త‌రిమి కొట్టాలి.. మేం కుటుంబ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం అంటూ కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. పాపం.. సామాన్యులు న‌మ్మేసి ఉంటారు. కానీ, ఇదే బీజేపీ గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఏం చేస్తోందంటే.. ఈ శ్రీరంగ నీతుల‌కు యూట‌ర్న్ ఇచ్చి.. అక్క‌డ వార‌సుల‌కు టికెట్లు ప్ర‌క‌టించింది. ఒక‌టి అరా అయితే, ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఏకంగా తొలిద‌శ ఎన్నిక‌ల్లో ఏడు స్థానాలు, రెండో ద‌శ‌లో 12 స్థానాల్లో వార‌సుల‌కు మొత్తం 19 సీట్లు కేటాయించింది. వీరి త‌ర‌ఫున ప్ర‌చారం కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్ర‌ధాని మోడీ భుజానేసుకున్నారు. మ‌రి ఆ సంగ‌తేంటో చూద్దామా..

సాధారణ సమయాల్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే బీజేపీ ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. త్వరలో(డిసెంబ‌రు 1-5) జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వారసులు బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ కనీసం 20 మంది సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది. వారసుల రాకతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

విజయావకాశాలు, ఆయా నియోజకవర్గాల్లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు ఇలా వారసులకు టికెట్లు ఇచ్చామ‌ని బీజేపీనేత‌లు స‌మ‌ర్తించుకుంటున్నారు. చోటా ఉదయ్‌పుర్‌ స్థానాన్ని బీజేపీ నేత‌ రత్వా కుమారుడు రాజేందర్‌సిన్హ్‌కు కేటాయించింది. థ‌స్రా శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యోగేంద్ర పార్మర్‌ మాజీ ఎమ్మెల్యే రామ్‌సిన్హ్‌ పార్మర్‌ కుమారుడు.

అదే ప‌రంప‌ర‌లో గుజరాత్‌కు చెందిన మాజీ ఎంపీ విట్టల్‌ రాదదియా కుమారుడు జయేశ్‌ రాదాదియాకు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. వీరితో పాటు అనేక మంది సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కుమారులు ఈ సారి ఎన్నికల్లో బీజేపీ త‌ర‌ఫున‌ పోటీ చేస్తున్నారు. మ‌రి, ఈ ప‌రిణామం త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేత‌లు కుటుంబ పాల‌న అనే మూస డైలాగును ప‌క్క‌న పెడ‌తారో లేదో చూడాలి.