ఎమ్మ‌ల్యేను త‌రిమి కొట్టిన జ‌నాలు

దేశంలోనే కాదు, ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ ఘ‌ట‌న జ‌రిగినా అది ఆస‌క్తి అనుకుంటే నెటిజ‌న్లు నిర్మొహ‌మాటంగా త‌మ అభిప్రాయం వెల్ల‌డిస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉండ‌డం, డిజిట‌ల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావ‌డంతో ఇప్పుడు ప్ర‌జ‌ల స్పంద‌న గ‌తంలో మాదిరిగా కాకుండా ఓ రేంజ్‌లో ఉంది. తాజాగా క‌ర్ణాట‌క‌లో ఓ ఎమ్మెల్యేను ప్ర‌జ‌లు త‌రిమి త‌రిమి కొట్టారు. ఎన్నాళ్లుగానో తాముఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స‌ద‌రు ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన జ‌నాలు.. త‌మ‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఎమ్మెల్యేకు చుక్క‌లు చూపించారు.

ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. అంతేకాదు, ఆయ‌న‌కు గాయాలు కూడా అయ్యాయి. ఈ ప‌రిణామం వైర‌ల్ కాగానే నెటిజ‌న్లు ఏపీపై ప‌డ్డారు. ఇక్క‌డ కూడా అనేక స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని, రోడ్ల ప‌రిస్తితి దారుణంగా ఉంద‌ని.. సో రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి ఓట్లేయ‌మ‌ని వ‌చ్చే వైసీపీ నేత‌ల‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఎద‌రవుతుందా? అంటూ నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మంళూరులో కలకలం రేగింది. ఎమ్మెల్యే కుమారస్వామిని గ్రామస్తులు చితక్కొట్టి.. త‌రిమి కొట్టారు. గ్రామస్తులు దాడికి దిగడంతో రక్షించుకునేందుకు ఎమ్మెల్యే రోడ్డుపై పరుగులు పెట్టారు. చిక్‌మంగళూరులో ఓ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే కుమారస్వామిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి రానివ్వకుండా దాడికి దిగారు.

ఏనుగుల సంచారం గురించి ఎంత మొరపెట్టుకున్నా.. ఎమ్మెల్యే వినలేదని గ్రామస్తులు మండిపడ్డారు. మనిషి చనిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు వస్తారా? అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. గ్రామస్తుల బారి నుంచి ఎమ్మెల్యేను రక్షించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గ్రామస్తులను అడ్డుకునే క్రమంలో తోపులాట, ఘర్షణ జరిగింది. కొందరు గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు పోలీసులు రక్షణ కవచంలా నిలబడినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఏపీకి అన్వ‌యిస్తూ.. నెటిజ‌న్లు హాట్ హాట్ కామెంట్లు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.