ఈ అతి తగ్గిస్తే చాలు బాబూ

నారా చంద్రబాబు నాయుడు తన ఘనతల గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకుంటారన్నది వాస్తవమే. కానీ ఆయన ముఖ్యమంత్రిగా అనేక విజయాలు సాధించారన్నది నిజం. ఆయన సారథ్యంలో రాష్ట్రం ప్రగతి వైపు అడుగులు వేసిందని, హైదరాబాద్ అసాధారణంగా అభివృద్ధి చెందిందని, ఐటీలో రాష్ట్రం పరుగులు పెట్టిందని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తుంటారు.

ఐతే ఆయన గురించి వేరే వాళ్లు ఎలివేషన్లు ఇచ్చినపుడు బాగుంటుంది కానీ కొన్నిసార్లు బాబు తనకు తాను గొప్పలు చెప్పుకోవడమే అతిగా అనిపిస్తుంది. ఈ లక్షణం వల్లే లేని విషయాలు కూడా ఆయనకు ఆపాదించి డబ్బా రాయుడంటూ విమర్శలు గుప్పిస్తుంటారు రాజకీయ ప్రత్యర్థులు. అన్నిటికీ తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు సెల్ ఫోన్ కూడా తనే కనిపెట్టినట్లుగా బిల్డప్ ఇచ్చుకున్నారంటూ వైకాపా ఆయన మీద కౌంటర్లు వేయడం గుర్తుండే ఉంటుంది.

ఐతే గతంలో వ్యవసాయం దండగ అని తాను అన్నట్లుగా దుష్ప్రచారం చేసినట్లే.. ఇప్పుడు సెల్ ఫోన్ విషయంలో అనని మాటలను తనకు ఆపాదిస్తున్నారంటూ చంద్రబాబు తన పాదయాత్రలో భాగంగా వైకాపాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని ఎప్పుడూ అనలేదని.. ఆ విషయాన్ని నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. తాను సెల్ ఫోన్ పెద్దగా వినియోగంలో లేని సమయంలో దాని ప్రాధాన్యతను గుర్తించానని.. టెలీ కమ్యూనికేషన్ చట్టాల్లో మార్పులు రావాలని, సెల్ ఫోన్ల వినియోగం పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారని చంద్రబాబు చెప్పారు.

తద్వారా దేశంలో మొబైల్ విప్లవానికి తాను ఒక రకంగా కారణం అయ్యానని అన్నారు. తాను ఇలా దూరదృష్టితో ఆలోచించి సిఫారసులు చేస్తే. ఇప్పుడు తన మీద విమర్శలు చేస్తున్న వారు అప్పుడు గోలీలాడుకుంటూ ఉన్నారంటూ పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి కౌంటర్ వేశారు చంద్రబాబు.